21-07-2025 08:01:19 PM
ఇల్లందు టౌన్ (విజయక్రాంతి): పేదరికంతో బాధపడుతూ అనారోగ్యం బారినపడిన వారికి ఆర్థిక సహాయం నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఖర్చుల కోసం 85 మంది లబ్ధిదారులకు మంజూరు అయిన రూ.27 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే కొరం కనకయ్య(MLA Koram Kanakaiah) లబ్ధిదారులకు సోమవారం క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేదరికంతో బాధపడుతూ అనారోగ్యాల బారిన పడుతున్న వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందించడం ద్వారా ప్రభుత్వం భరోసాగా నిలుస్తుందని చెక్కు తీసుకున్న లబ్ధిదారులు బ్యాంకుల్లో వేసుకోవాలని సూచించారు.
ప్రజలు ఏరి కోరి తెచ్చుకున్న ఇందిరమ్మ ప్రభుత్వానికి ఏడాదిన్నర పూర్తి కావస్తుందని ఈ ఏడాదిన్నెర కాలంలో మహిళలకు ఉచిత బస్సు, ఉచిత విద్యుత్, రైతు భరోసా, రేషన్ షాపుల ద్వారా ఉచిత సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్ళు మొదలైన సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే సంక్షేమ పథకాలు ప్రజల దరి చేరడంలో కాస్త ఆలస్యం అవుతుందన్నారు. ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే వారికి ప్రజలు ఆశీస్సులు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు, పట్టణ మండల అధ్యక్షులు దొడ్డ డానియల్ పులి సైదులు, మాజీ వైస్ ఎంపీపీ మండల రాము, మడుగు సాంబమూర్తి, బొల్లా సూర్యం, చిల్లా శ్రీనివాస్, పట్టణ మండల నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.