27 March, 2026 | 1:44 AM

పాడి రైతుపై ‘బకాయిల’ భారం

27-03-2026 12:00 AM

సర్కారు ఆదుకోవాలన్న ఎమ్మెల్యే కసిరెడ్డి

ఆమనగల్లు/ కడ్తల్, మార్చి 26 (విజయక్రాంతి): వ్యవసాయానికి వెన్నుముకగా నిలిచే పాడి పరిశ్రమ నేడు సంక్షోభంలోకూరుకుపోతోంది. రెక్కలు ముక్కలు చేసుకుని పాలు పితికితే, వచ్చిన పైసలు చేతికందక పాడి రైతు కన్నీరు పెడుతున్నాడు. కల్వకుర్తి నియోజకవర్గంలోని పాడి రైతుల సమస్యలపై ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి గురువారం అసెంబ్లీలో గళమెత్తారు. నియోజకవర్గ పరిస్థితిపై ’కసిరెడ్డి’ ఆవేదనను 

అసెంబ్లీ సాక్షిగా వెళ్లిబుచ్చారు. కల్వకుర్తి ప్రాంత రైతుల దుస్థితిని వివరిస్తూ ఎమ్మెల్యే కొన్ని కీలక అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గంలో మెజారిటీ ప్రజలు సన్న, చిన్నకారు రైతులే. వీరికి వ్యవసాయం తర్వాత ప్రధాన జీవనాధారం పాడి పరిశ్రమ పై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నట్లు ఆయన చెప్పారు.సాధారణంగా ప్రతి 15 రోజులకోసారి రైతులకు అందాల్సిన బిల్లులు నెలలు గడుస్తున్నా అందడం లేదు. ప్రస్తుతం వరుసగా నాలుగు విడతల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని ఆయన వివరించారు. 

పశుగ్రాసం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, పాలు పోసినందుకు రావాల్సిన డబ్బులు రాకపోవడంతో పశువులను పోషించడం రైతులకు భారంగా మారిందని గుర్తు చేశారు.కేవలం బిల్లులే కాకుండా, ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిన లీటరుకు రూ. 4 ఇన్సెంటివ్ (ప్రోత్సాహకం) కూడా సకాలంలో అందడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ప్రైవేట్ డైరీల పోటీని తట్టుకుని ప్రభుత్వ డైరీలకు పాలు పోస్తున్న రైతులను, బిల్లుల ఆలస్యం నిరుత్సాహానికి గురిచేస్తోందన్నారు.రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. 15 రోజులకోసారి రావాల్సిన బిల్లుల కోసం రైతులు నెలల తరబడి ఎదురుచూడటం బాధాకరం. వెంటనే ప్రభుత్వం స్పందించి బకాయిలు విడుదల చేయాలని ఎమ్మెల్యే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.కల్వకుర్తి నియోజకవర్గ పాడి రైతుల గోడును విన్న ప్రభుత్వం, మరి ఏ మేరకు వేగంగా స్పందిస్తుందో వేచి చూడాలి.