17-11-2025 05:22:06 PM
చొప్పదండి (విజయక్రాంతి): గంగాధర మండలం కురిక్యాల గ్రామానికి చెందిన భీమనాతిని సత్యవ్వ అనే మహిళ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. గంగాధర మండలంలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం కోసం అటుగా వెళుతున్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రమాదాన్ని గమనించి తన వాహనాన్ని ఆపారు. గాయపడిన మహిళను దగ్గరుండి స్థానిక పోలీస్ వాహనంలో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్ లోని ఆసుపత్రి వైద్యులతో ఫోనులో మాట్లాడి గాయపడిన మహిళకు మెరుగైన వైద్యం అందజేయాలని ఆదేశించారు. ప్రమాదంలో గాయపడిన మహిళను స్వయంగా ఆసుపత్రికి తరలించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను మండల ప్రజలు అభినందించారు.