ప్రముఖ కవి డాక్టర్ అందె శ్రీ అకాల మరణం తీరని లోటు
సంతాపం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ రచయిత, ప్రముఖ కవి డాక్టర్ అందె శ్రీ అకాల మరణం పట్ల మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డాక్టర్ అందె శ్రీ మరణంతో తెలంగాణ సాహిత్యరంగానికి, రాష్ట్రానికి తీరని లోటు ఏర్పడిందని ఎమ్మెల్యే తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన రచనలు, పాటలు ప్రజలకు అపారమైన ప్రేరణగా నిలిచి కీలక పాత్ర పోషించాయని గుర్తుచేశారు.
“జయ జయహే తెలంగాణ” గీతం రూపుదిద్దుకునే సమయంలో అందె శ్రీతో తనకు ఏర్పడిన అనుబంధాన్ని స్మరించుకున్న ఎమ్మెల్యేఉద్యమ కాలంలో అనేక సమావేశాల్లో కలిసి పాల్గొని ప్రజల్లో స్పూర్తి నింపిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు. ఆయనతో తనకున్న వ్యక్తిగత సన్నిహిత సంబంధాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. అందె శ్రీ రచనలు శాశ్వతంగా చిరస్మరణీయంగా నిలిచిపోతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.






