28-05-2025 09:26:00 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): భారత రాష్ట్ర సమితి(Bharat Rashtra Samithi)కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kalvakuntla Kavitha) కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లపై తీవ్రంగా స్పందించారు. ఈ ఊహాగానాల్లో ఎలాంటి నిజం లేదని తోసిపుచ్చుతూ ఒక వార్తాపత్రిక కథనం క్లిప్పింగ్ను కవిత తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ అసంతృప్తిని వ్యక్తం చేశారు. కనీసం నన్ను సంప్రదించకుండా ఈ వార్త రాసిన పత్రికది జర్నలిజమా..? శాడిజమా..? అని ప్రశ్నించారు. గత కొన్ని నెలలుగా కవిత తెలంగాణ జాగృతి సంస్థను బలోపేతం చేస్తూ ఆ దిశగా అడుతుగు వేస్తున్నారు.
అనుబంధ విభాగాల వరుస ప్రకటనలు, సంస్థాగత కార్యకలాపాల విస్తరణ ఆమె కొత్త రాజకీయ పార్టీకి పునాది వేస్తున్నారనే ఊహాగానాలు చర్చనియంశంగా మారాయి. వరంగల్లో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల తర్వాత కవిత పార్టీ అధినేత, ఆమె తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి లేఖ రాసిన విషయం తెలిసిందే. అమెరికా పర్యటనకు బయలుదేరే ముందు ఆమె వివిధ తెలంగాణ జాగృతి అనుబంధ సంస్థలకు నియామకాలను కూడా ప్రకటించారు. ఈ పరిణామాలు ఆమె కొత్త రాజకీయ ఏర్పాటును స్థాపించాలనే ఉద్దేశ్యాన్ని గురించిన పుకార్లకు మరింత ఆజ్యం పోశాయి.
కొన్ని సోషల్ మీడియాల్లో తన పార్టీ పేరు కూడా ఖరారు అయ్యిందని, కేసీఆర్ పంపిన దూతలతో కవిత జరిపిన చర్చలు విఫలమయ్యాయని కూడా వెల్లడించాయి. జూన్ 2, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు కవిత కొత్త పార్టీని అధికారికంగా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆరోపించాయి. ఈ వార్తలన్నింటినీ కవిత ఖండిస్తూ, అవి నిరాధారమైనవని, తన ప్రమేయం లేకుండా ప్రచురించబడ్డాయని స్పష్టం చేశారు. తనకు సంబంధించిన వార్తను ప్రచురించబడటానికి ముందు మీడియా సంస్థలు కవితను సంప్రదించలేదని పునరుద్ఘాటించారు.