13-08-2025 01:54:16 PM
కళ్ళు ఉండి చూడలేని కబోది జగదీశ్ రెడ్డి
బిఆర్ఎస్ ది ఫామ్ హౌస్ పాలన.. కాంగ్రెస్ ది ప్రజా పాలన
బిఆర్ఎస్ పాలకులపై ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఫైర్
నల్గొండ టౌన్,(విజయక్రాంతి): అసలైన సిసలైన దద్దమ్మలు బిఆర్ఎస్ పాలకులే మీ పార్టీ కవిత చెప్పింది నువ్వు లిల్లీ అని ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నేనావత్ శంకర్ నాయక్, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై మండిపడ్డారు. బుధవారం ఆయన జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోటి రూపాయల సొంత నిధులతో కాలువలో చెట్లను తొలగించారని పేర్కొన్నారు.
ఎస్ఎల్బీసీ, డిండి, నక్కల గండి ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలోనే అన్ని కాంగ్రెస్ హయంలోనే పూర్తి చేస్తామని ప్రజలకందరికి తెలుసన్నారు. మా మంత్రులు సర్వతో ముఖ అభివృద్ధి కోసం పనిచేస్తున్నారని పేర్కొన్నారు. గత బిఆర్ఎస్ పాలకులు భూ దందాలు, ఇసుక దందా కంకర దందా చేశారని విమర్శించారు. మా మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి,ఉత్తంకుమార్ రెడ్డిలను విమర్శించే స్థాయి జగదీష్ రెడ్డికి లేదన్నారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వం నల్గొండ జిల్లాలో పెండింగ్లో పెట్టిన సాగు తాగు నీతి ప్రాజెక్టులన్నింటినీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని నిధులు విడుదల చేసి పూర్తి చేయడానికి కృషి చేస్తున్నాడని అన్నారు. బిఆర్ఎస్ హయంలో బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పూర్తి అయిందన్నారు. బిఆర్ఎస్ హయంలో జగదీశ్ రెడ్డి తన ఫామ్ హౌస్ ను డెవలప్మెంట్ చేసుకున్నాడు తప్ప జిల్లా అభివృద్ధికి చేసింది ఏమీ లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని కళ్ళు ఉండి చూడలేని కబోది జగదీశ్ రెడ్డి అని మండిపడ్డారు.ఇప్పటికైనా అసత్య ఆరోపణలు మానుకోవాలని, లేనిపక్షంలో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.