మోదీ 3.0 మనుగడ కష్టమే
ఎన్డీయే నేతలు మాతో టచ్లో ఉన్నారు
ఆ కూటమి బలహీనంగా ఉంది
రాహుల్గాంధీ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, జూన్ 18: కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే కూటమిలో తీవ్ర అసంతృప్తి ఉందని, కొందరు నేతలు తమతో టచ్లో ఉన్నారని తెలిపారు. ఫైనాన్షియల్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విధంగా మాట్లాడారు. అధికార కూటమిలోని కొందరు నేతలు తమతో టచ్లో ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కూటమి మనుగడ కోసం ఇబ్బంది పడే అవకాశముంది.
కూటమి బలహీనంగా ఉండటంతో ఏ చిన్న సమస్య అయినా ప్రభుత్వాన్ని కూల్చేస్తుంది అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఎన్నికల ప్రచారంలో మోదీ చేసిన ప్రసంగాలను విమర్శించారు. విద్వేషాన్ని వ్యాప్తి చేసి మోదీ ఫలితాన్ని సాధించారని, అయితే ఈసారి ఆయన ఆలోచనను ప్రజలు తిరస్కరించారని తెలిపారు. ఎటువంటి వివక్ష లేని పరిస్థితులు ఉండి ఉంటే ఇండియా కూటమి నిస్సందేహంగా మెజార్టీ దక్కించుకునేదని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ చేతులు కట్టేసినా తాము పోరాడామని, అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో ప్రజలకు కచ్చితంగా తెలుసునని పేర్కొన్నారు.






