08-05-2025 01:15:03 AM
న్యూఢిల్లీ, మే 7: దాయాది పాకిస్థాన్కు ఒకరకమైన సంకేతాలు ఇచ్చి.. ఏమార్చి ఎవరూ ఊహించని రీతిలో తొమ్మిది ఉగ్ర స్థావరాలపై దాడి చేయించి ప్రధాని మోదీ మరోసారి తన వ్యూహ చతురతను ప్రపంచానికి చాటిచెప్పారు. ‘ఎడమ వైపు సిగ్నల్ ఇచ్చి.. కుడివైపునకు మళ్లండి’ అనే ఇంగ్లిష్ సామెత చందంగా మోదీ తన మార్క్ నిర్ణయం తీసుకున్నారు.
గతంలో బాలకోట్ దాడి సమయంలోనూ ఇలాంటి వ్యూహాన్నే మోదీ పన్నారు. అలా యుద్ధ సమయాల్లో తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ అంతర్జాతీయస్థాయిలో కీర్తి ప్రతిష్ఠలు తెచ్చుకుంటున్నారు. 2019 ఫిబ్రవరి 26న పాకిస్థాన్లోని బాలకోట్పై భారత సైన్యం దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఆ దాడి జరిగే 24 గంటల ముందు కూడా ప్రధాని మోదీ ప్రశాంతమైన వదనంతో ఢిల్లీలో జాతీయ యుద్ధ స్మారక చిహ్నాన్ని ఆవిష్కరించి జాతికి అంకితమిచ్చారు. రేపు బాలాకోట్లో జరుగతుందని తెలిసి కూడా స్థితప్రజ్ఞతతో వ్యవహరించారు. జాతికి విలువైన సందేశమిచ్చారు.
తాజా నిర్ణయంతోనే..
2019లో బాలాకోట్లో వ్యవహరించిన విధంగానే ప్రధాని మోదీ ఇప్పుడు కూడా వ్యవహరించారు. తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరుగబోతున్నాయనే అంశాన్ని మదిలో ఉంచుకుని.. మంగళవారం రాత్రి ఢిల్లీలో ఏబీపీ మీడియా సంస్థ చేపట్టిన ఓ సదస్సుకు హాజరయ్యారు. సుమారు 30 నిమిషాల పాటు ప్రసంగించారు.
ఇదే వేదిక నుంచి యుద్ధ సన్నద్ధతపై దేశవ్యాప్తంగా మాక్డ్రిల్ నిర్వహిస్తామని ప్రకటించారు. ఆ వార్తలను చూసిన పాకిస్థాన్ ‘మాక్డ్రిల్ మాత్రమేగా..’ తేలిగ్గా తీసుకుని ఉండొచ్చు. కానీ.. ఉగ్రవాద స్థావరాలపై దాడి జరిగిన తర్వాత పాక్ నివ్వెరపోయి ఉండొచ్చు.
అహర్నిశలూ ప్రధాని మోదీ పర్యవేక్షణ
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ఉగ్రవాద శిబిరాలపై దాడికి వ్యూహరచన, ఆ తర్వాత తొమ్మిది చోట్ల దాడులను ప్రధాని మోదీ నిశితంగా పరిశీలించారు. మంగళవారం సాయంత్రం నుంచి రాత్రంతా పర్యవేక్షిస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు త్రివిధ దళాల ఉన్నతాధికారు లను అప్రమత్తం చేస్తూ వచ్చారు.