ముగ్గురు దేశాధినేతలతో మోదీ సంభాషణ
- భారతీయుల భద్రతపై ఆరా
వారికి అండగా నిలవాలని విజ్ఞప్తి
న్యూఢిల్లీ, మార్చి ౩: పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రమవుతున్న నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఒమన్ సుల్తాన్ హైతం బిన్తారిక్, కువైట్ క్రౌన్ ప్రిన్స్ షేక్ సబా అల్-ఖలేద్, ఖతార్ అమీర్ షేక్ తమీం బిన్ హమద్ అల్ థానీతో ఫోన్లో సంభాషించారు. ఆయా దేశాలపై జరుగుతున్న దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. శాంతిని నెలకొల్పడానికి దౌత్యపరమైన చర్చలే ఏకైక మార్గమని ఆయన సూచించారు.
ప్రాంతీయ స్థిరత్వం కోసం భారత్ తన వంతు సహకారం అందిస్తుందని భరోసానిచ్చారు. అలాగే గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న కోటి మందికిపైగా భారతీయుల భద్రత గురించి ప్రధాని ప్రత్యేకంగా చర్చించారు. క్లిష్ట పరిస్థితుల్లో భారతీయులకు అండగా నిలవాలని కోరారు. యుద్ధం వల్ల చమురు సరఫరా, వాణిజ్య మార్గాలకు ఆటంకం కలగడంపై ఆందోళన వ్యక్తం చేశారు.




