20-06-2025 01:19:49 AM
కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి
కామారెడ్డి, జూన్ 19 (విజయ క్రాంతి), భారతదేశాన్ని విశ్వ గురువుగా చేయడమే ప్రధాని మోదీ లక్ష్యమని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. గురువారం కామారెడ్డి నియోజకవర్గంలోని బిబిపేట్ దోమకొండ బిక్కనూర్ రాజంపేట మండలాల్లోని పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. అనంతరం భిక్కనూరు మండలం జంగంపల్లిలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వికసిత భారత సంకల్ప సభను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మాజీ బిజెపి జిల్లా అధ్యక్షులు అరుణతార ముఖ్యఅతిథిగా హాజరై మొక్కలు నాటిన అనంతరం మాట్లాడారు. ఈ సందర్భంగా అరుణా తార మాట్లాడుతూ నరేంద్రమోదీ గత 11 సంవత్సరాలుగా అనేక విజయాలు సాధించడం జరిగిందని ఆర్దికంగా, సాంస్కృతికంగా, దౌత్య పరంగా, అన్ని రంగాల్లో దేశాన్ని ముందుకు నడిపించడంలో నరేంద్ర మోదీ విజయం సాధించారని అన్నారు.
పల్లె నుండి పట్నం వరకు, గల్లి నుండి డిల్లీ వరకు జరిగిన ప్రతి అభివృద్ధి పనిలో కేంద్ర ప్రభుత్వ వాట ఉందని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గంలో బీజేపీ తిరుగులేని మెజారిటీ సాధించిందనీ, అదే స్ఫూర్తితో వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, బిక్కనూరు మండల బిజెపి నాయకులు పాల్గొన్నారు.