జోర్డాన్లో ముగిసిన మోదీ పర్యటన
- స్వయంగా కారు నడుపుతూ మోదీని మ్యూజియానికి తీసుకెళ్లిన జోర్డాన్ యువరాజు
- ఇరు దేశాల మధ్య 5 బిలియన్ డాలర్ల వాణిజ్యమే లక్ష్యంగా చర్చలు
- ఇథియోపియాకు బయల్దేరిన ప్రధాని
అమ్మాన్, డిసెంబర్ 16: జోర్డాన్లో ప్రధాని నరేంద్ర రెండు రోజుల పర్యటన విజయవంతంగా ముగిసింది. మంగళవారం ఆయన తన మూడు రోజుల విదేశీ పరటనలో భాగంగా ఇథియోపియాకు బయల్దేరి వెళ్లారు. కాగా జోర్డాన్ యువరాజు అల్-హుస్సేన్ బిన్ అబ్దుల్లా-2 ప్రత్యేక గౌరవ సూచకంగా విమానాశ్రయానికి వచ్చి ప్రధాని మోదీకి ఘనంగా వీడ్కోలు పలికారు. అలాగే జోర్డాన్ యువరాజు స్వయంగా కారు నడుపుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీని అమ్మాన్లోని జోర్డాన్ మ్యూజియానికి తీసుకెళ్లడం విశేషం. అక్కడ యువరాణి సుమయా బింట్ ఎల్ హసన్ వారికి మ్యూజియం విశేషాలను వివరించారు.
భారత్-జోర్డాన్ బిజినెస్ ఫోరంలోనూ ప్రధాని పాల్గొన్నారు.ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ జోర్డాన్ రాజు అబ్దుల్లా-2తో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని 5 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకోవాలని ఈ సందర్భంగా మోదీ ప్రతిపాదించారు.
పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య పునరుత్పాదక ఇంధనం, సాంస్కృతిక రంగం, నీటి నిర్వహణ వంటి పలు కీలక అంశాలపై అవగాహన ఒప్పందాలు కుదిరాయి.జోర్డాన్ పర్యటన అనంతరం ప్రధాని మోదీ ఇథియోపియా బయల్దేరారు. ఇథియోపియా ప్రధాని అబియ్ అహ్మద్ ఆహ్వానం మేరకు మోదీ అక్కడ పర్యటిస్తున్నారు. భారత్ అధ్యక్షతన జీ20 కూటమిలో ఆఫ్రికన్ యూనియన్కు శాశ్వత సభ్యత్వం కల్పించిన తర్వాత జరుగుతున్న ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. మోదీ అక్కడి పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.




