23-06-2025 12:36:36 AM
మహబూబాబాద్, జూన్ 22 (విజయ క్రాంతి): ఉదయం పూర్వ పాత్రికేయ మిత్రమండలి ఆత్మీయ సమ్మేళనం ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని లయన్స్ క్లబ్ భవనంలో జిల్లా అధ్యక్షుడు దాసరి కృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉదయం దినపత్రిక మాజీ న్యూస్ కోఆర్డినేటర్, రాజ్యసభ మాజీ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన ఉదయం దినపత్రిక మూతబడి 30 సంవత్సరాలు గడిచినా అందులో పనిచేసిన వరంగల్ జిల్లా పాత్రికేయులు, ఇతర సిబ్బంది ఉదయం మిత్రమండలి ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమన్నారు.
ఆనాటి పాత్రికేయులు, సిబ్బంది తమ మధ్య ఉన్న ఆత్మీయ బంధాన్ని మరింత దృఢ పరుచుకోవడానికి ఆనాటి స్టాఫ్ రిపోర్టర్ దాసరి కృష్ణారెడ్డి చేసిన కృషిని అభినందించారు. ఆనాటి పాత్రికేయులు, సిబ్బంది సంక్షేమం కోసం ఆర్థిక సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం కూడా ప్రశంసనీయమన్నారు.
ఉదయం మిత్ర మండలికి తన సంపూర్ణ సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉదయం మిత్రమండలి వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కన్నా పరశురాములు, కోశాధికారి అచ్యుత రఘునాథ్, ఉపాధ్యక్షులు మహేందర్, సంయుక్త కార్యదర్శి ముల్లంగి మోహన్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు శర్మ, రామ్మూర్తి, ఉదయం జ్ఞాపిక సంపాదకులు ఆర్. లక్ష్మణ్ సుధాకర్, పూర్వ పాత్రికేయులు సత్యనారాయణ, రమేష్, గొడుగు శ్రీనివాస్, రామారావు, శ్రీధర్, ఓంకార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.