తల్లీ ఏందీ.. మాకు ఈ లొల్లి!
రాష్ట్రంలో ఇప్పుడు చర్చంతా తెలంగాణ తల్లి విగ్రహం గురించే. అసలైన తెలంగాణ తల్లి రూపం మాదంటే మాదని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు విమర్శల దాడి చేసుకుంటున్నారు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో దుమ్మెత్తిపోసుకుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ తల్లి విగ్రహం మారుస్తామని ప్రకటించి, ఈ నెల ౯న ప్రారంభించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తుంది.
గడీల్లో ఉండే దొరసాని రూపంలా బీఆర్ఎస్ రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం ఉందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. రేవంత్ సర్కార్ రూపొందించిన విగ్రహం తెలంగాణ తల్లిదా? కాంగ్రెస్ తల్లిదా? అని బీఆర్ఎస్ నేతలు సైతం ఘాటుగానే స్పందిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న ఎన్నో సమస్యలను పక్కన పెట్టేసి, తమ విగ్రహం గొప్పదని.. కాదు కాదు తమ విగ్రహమే గొప్పదని అటు అధికార పక్షం.. ఇటు ప్రతిపక్షం విమర్శలు చేసుకోవడంతో ‘ఏందీ తల్లీ మాకు ఈ లొల్లి’ .అని తెలంగాణ బిడ్డలు చర్చించుకుంటున్నారు.




