రైతు సంక్షేమానికి కృషి
ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్
నిర్మల్, డిసెంబర్ 7 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నదని రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవతి అనిల్ అన్నారు. శనివారం నిర్మల్ జిల్లా మామాడ మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన ప్రజాపాలన సంబురాల్లో ఆయన పాల్గొన్నారు. రైతు వేదిక వద్ద జరగిన కార్యక్రమాల్లో సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు.
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హమీలు అమలు చేస్తుంటే ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక ప్రభుత్వంపై చౌకబారు విమర్శలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, మహిళలకు మహలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణం, రైతులకు బోనస్ ఇస్తున్నట్టు తెలిపారు. కేసీఆర్ పాలనలోనే ప్రజాప్రతినిధులు దాచుకోవడం, దోచుకోవడమే జరిగిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు శ్రీహారిరావు, మార్కెట్ కమిటీ చైర్మన్లు భీంరెడ్డి, ఆది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.




