12-06-2025 02:59:59 PM
22 ఏళ్లకు తెరుచుకున్న పాఠశాల
25 ఏళ్లుగా ‘వరండా’లో పాఠశాల
మహబూబాబాద్,(విజయక్రాంతి): నూతన విద్యా సంవత్సరం ప్రారంభం రోజున మహబూబాబాద్ జిల్లాలో రెండు వి‘భిన్న’మైన పాఠశాలల దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. బయ్యారం మండలంలోని మోట్ల గూడెం పాఠశాల 2003లో మూతపడగా ఈసారి ఉపాధ్యాయులు ఆవాస ప్రాంత తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంతో తమ పిల్లలను ప్రభుత్వ బడికి పంపాలని నిర్ణయించడంతో గురువారం ఆరుగురు పిల్లలు పాఠశాలకు వచ్చారు.
దీనితో 22 ఏళ్ల క్రితం మూతబడ్డ పాఠశాల తిరిగి తెరుచుకుంది. తొలి రోజు పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు మండల విద్యాధికారి పబ్బోజు దేవేంద్ర చారి పాఠ్యపుస్తకాలు అందించడంతోపాటు మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. తాత్కాలికంగా విద్యార్థులకు విద్యాబోధన చేయడానికి ఇద్దరు ఉపాధ్యాయులను డిప్యూటేషన్ పై పాఠశాలకు పంపారు. మిగిలిన విద్యార్థులను కూడా ఒకటి రెండు రోజుల్లో పాఠశాలకు పంపిస్తామని తల్లిదండ్రులు చెప్పినట్టు ఎంఈఓ తెలిపారు.
25 ఏళ్లుగా వరండాలోనే పాఠశాల!?
ఇక ఇదే జిల్లా కేసముద్రం బల్దియా లో బ్రహ్మంగారి తండాలో 1995 సంవత్సరంలో జిల్లా ప్రాథమిక విద్యా పథకం (డీపెప్)లో పాఠశాల మంజూరు చేసి ఇప్పటివరకు వసతి కల్పించలేదు. ఫలితంగా 25 ఏళ్లుగా బ్రహ్మంగారి తండా ప్రభుత్వం ప్రాథమిక పాఠశాల మధ్యాహ్న భోజనం వండి పెట్టె వంట మనిషి ఇంటి వరండాలోనే నిర్వహిస్తున్నారు. గత ఏడాది ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమంలో పాఠశాల నిర్మాణానికి చర్యలు చేపట్టగా పిల్లర్ల లోనే వదిలేశారు.
దీనికి తోడు పాఠశాల కోసం రెవెన్యూ శాఖ కేటాయించిన నాలుగు గుంటల భూమిలో రెండు గుంటల భూమి అన్యాక్రాంతం అయ్యింది. వసతి సరిగా లేకపోవడంతో బ్రహ్మంగారి తండాలో ఉన్న బడి ఈడు పిల్లలను ఈ బడికి పంపకుండా రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో ప్రాథమిక పాఠశాలకు పంపుతున్నారు.