calender_icon.png 18 January, 2026 | 3:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

50 టీఎంసీలతో మున్నేరు--పాలేరు

18-01-2026 01:24:40 AM

  1. గ్రావిటీ లింక్ నిర్మాణానికి రూ. 162.57 కోట్లు 
  2. ఈ ప్రాజెక్ట్ పొడవు 9.6 కిలోమీటర్లు 
  3. ఖమ్మం, సూర్యాపేట, మానుకోట జిల్లాల్లో 1.38 లక్షల ఎకరాల స్థిరీకరణ
  4. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి

హైదరాబాద్, జనవరి 17 (విజయక్రాంతి): సహజవనరులను వినియోగించి వరద ముప్పు నివారించడంతోపాటు ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు సాగునీరు అందించేందుకే రాష్ర్ట ప్రభుత్వం 50 టీఎంసీల మున్నేరు--పాలేరు లింక్ పథకం చేపట్టిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నా రు. పనులకు రూ.162.57 కోట్లు కేటాయించిందని తెలిపారు.  లింక్ కాలువ పొడ వు 9.6 కిలోమీటర్లు కాగా ఇది సెకనుకు 4,500 క్యూ సెక్కుల నీటి ప్రవాహాన్ని తట్టుకునేలా రూపొందించినట్లు శనివారం ఒక ప్రకట నలో పేర్కొన్నారు. లింక్ ప్రా జెక్టు పూర్తి అయితే ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో 1.38 లక్షల ఎకరాలకు నీటి స్థిరీకరణతో పాటు పాలేరు రిజర్వాయర్ ఎగువ భాగంలోని 40 ఎకరాల ఎన్‌ఎస్‌పీ ఆయకట్టుకు నీటి భద్రత లభిస్తుందని వెల్లడించారు.

మున్నేరు  నుంచి ప్రతి సంవత్సరం వచ్చే వరద నీటిని సద్వినియోగం చేసుకోవడంతో పాటు వృథాగా పోతున్న సుమారు 50 టీఎంసీల నీటితో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అంకురార్పణ చుట్టిందని వెల్లడించారు. ఖమ్మం జిల్లాలో మున్నేరు నష్టాన్ని నివారించేందుకు ప్రభుత్వ నిర్ణయం దోహదపడుతుందని వివరించారు. మున్నే రు వరద జలాలతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు తక్కువ ఖర్చుతో ఎ క్కువ ఫలితాలు సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూర్ గ్రా మంలోని చెక్ డ్యాం ద్వారా నీరు మళ్లించి నిర్మించే మున్నేరు--పాలేరు లింక్ పథకంతో శ్రీరాంసాగర్ ప్రా జెక్ట్ స్టేజ్--2ను బలోపేతం చేయడం తోపా టు పాలేరు రిజర్వాయర్ ద్వారా భక్త రామదాసు ఎత్తిపోతల పథకం కింద ఉన్న డీబీఎం 60 ద్వారా ఖరీఫ్ సాగుకు 70,308 ఎకరాల ఆయకట్టుకు అదనపు నీటి లభ్యత చేకూరుతుందని తెలిపారు. అదే విధంగా సూర్యాపేట జిల్లాలోని మోతే ఎత్తిపోతల పథకం ద్వారా డీబీఎం -71 కింద ఉన్న 46,712 ఎకరాల భూమికి నిరంతరం సాగునీటిని అందించవచ్చని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుతో కేవలం సాగునీరే కాకుండా ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలో తాగు నీటి అవసరాల కోసం మిషన్ భగీరథ పథకానికి 4.70 టీఎంసీల నీటిని కేటాయిస్తున్నట్లు వివరించారు.

అన్నింటికీ మించి ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ద్వారా సీతారామ ప్రాజెక్ట్‌కు వినియోగిస్తున్న విద్యుత్ చార్జీల కోసం రాష్ర్ట ప్రభుత్వం సాలీనా చెల్లిస్తున్న విద్యుత్ చార్జీల భారం నుంచి తప్పించుకోవచ్చన్నారు. దీంతోపాటు అదనపు నీటితో పాలేరు రిజర్వాయర్ దిగువన ఉన్న హైడల్ ప్లాంట్‌లో 2 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తికి ఆస్కా రం ఏర్పడుతుందని వివరించారు. మొత్తం గా ఈ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా మున్నేరు ఉగ్రరూపం దాల్చిన ప్రతి సమయంలో అతలాకుతలం అయ్యే ప్రాంతాల ప్రజలకు ఇకపై ఎటువంటి ఇబ్బంది కలగదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.