11-08-2025 10:34:43 PM
నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేంద్రంలో ఈ నెల 3న జరిగిన హత్య కేసులో నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ తిరుపతిరావు(DSP Tirupati Rao) కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని భూపతన్నకాలనీకి చెందిన నిందితుడు శ్రీను, మృతుడు తుళ్ల ప్రభాకర్ స్నేహితులు. వీరిద్దరూ ఎలాంటి బాధ్యత లేకుండా అప్పుడప్పుడు కూలి పనులు చేస్తూ వచ్చిన డబ్బులతో జులాయిగా తిరుగుతూ, మద్యానికి బానిసలుగా మారారు. వీరు మహబూబాబాద్ లోని లెనిన్ నగర్ ఉండేవారు. ఈనెల మూడవతేదీన రాత్రి సుమారు 10.30 గంటలకు మృతుడు ప్రభాకర్ తన ఇంటి ముందు మద్యం తాగుతుండగా, అప్పటికే మద్యం సేవించి ఉన్న నిందితుడు శీను అక్కడికి చేరుకొని మద్యం ఎందుకు తాగుతున్నావు అని అడిగాడు. ఈ క్రమంలో మాట మాట పెరిగి నిందితుడు శీనును ప్రభాకర్ నా ఇంట్లోకి రాకు ఇక్కడినుంచి వెళ్ళిపో అని మళ్ళీ ఇరువురు తీవ్రంగా గొడవ పెట్టుకున్నారు.
దాంతో నిందితుడు శీను కు కోపం వచ్చి పక్కన రేకుల ఇంటి వద్ద ఉన్న కర్రని తీసుకొని క్షణికావేశంతో, సిసి రోడ్డు మీద చాపలో కూర్చుని ఉన్న ప్రభాకర్ తలపై గట్టిగా కర్రతో కొట్టాడు. దాంతో ప్రభాకర్ కింద పడిపోయాడు. ఆవేశంలో మళ్ళీ అతని తలపై గట్టిగా రెండు, మూడు దెబ్బలు కొట్టాడు. రక్తం మడుగులో ఉన్న ప్రభాకర్ ని చూసి భయపడి కర్రను ఎక్కడి నుంచి తెచ్చాడో మళ్ళీ అక్కడే పెట్టేసి, వచ్చి మద్యం మత్తులో ఉండడంతో అక్కడే ఇంట్లో పడుకున్నాడు. ఉదయం లేచి, మత్తు నుంచి తేరుకొని ప్రభాకర్ చనిపోయాడని నిర్ధారించుకొన్న శీను పోలీసులు పట్టుకుంటారేమో అన్న భయంతో అక్కడి నుండి పుష్ పుల్ ట్రైన్ ఎక్కి, ఖమ్మం పారిపోయాడు.
అక్కడే మిల్లుల్లో పని చేసుకుంటూ వచ్చిన డబ్బులతో తిని, తాగుతూ అక్కడే ఉన్నాడు. సోమవారం గోల్కొండ ట్రైన్ కు మహబూబాబాద్ కు వచ్చి ట్రైన్ దిగిన శీను తన ఇంటికి వెలుతున్న క్రమంలో అక్కడే పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులను చూసి భయంతో పారిపోయే ప్రయత్నం చేసాడు. దీంతో అనుమనం వచ్చిన పోలీస్ లు అదుపులోకి తీసుకొని విచారించగా తూళ్ల ప్రభాకర్ ని హత్య చేసింది తనేనని శీను ఒప్పుకున్నాడు. హత్య చేసిన తీరును వివరించాడు. హత్యకు ఉపయోగించిన కర్రను లెనిన్ నగర్ లో పోలీసులు స్వాదీనం చేసుకొని, కేసునమోదు చేసి నిందితున్ని న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ కేసులో నిందితున్ని పట్టుకున్న మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య, టౌన్ ఎస్ఐలు ప్రశాంత్ బాబు, శివ, అశోక్, వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్స్ రుద్రయ్య, రమేష్ చంద్ర, గౌతమ్, నాగరాజు తదితరులను జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకాన్ అభినందించారు.