మండె మెలిగే పండగతో ప్రారంభమైన నాగులమ్మ జాతర
ఆదివాసీ పూజారుల ప్రత్యేక పూజలు
మంగపేట, మార్చి 3 ( విజయక్రాంతి ) : ములుగు జిల్లా మంగపేట మండలం వాగొడ్డుగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని లక్ష్మీనర్సాపూర్ గ్రామంలోని శ్రీ నాగులమ్మ ఆలయంలో మంగళవారం మండె మెలిగే పండగతో నాగులమ్మ మహా జాతర ప్రారంభమైంది. ఐదు రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్న మహా జాతరలో మొదటి రోజైన మంగళవారం ఉదయం ( చంద్ర గ్రహణ సమయం ప్రారంభానికి ముందు ) నాగులమ్మ ఆలయానికి ముందుఆలయం ఎదుట తోరణ స్తంభాలను నిలిపి, పసుపు కుంకుమలతో అలంకరించిన గడపను ప్రతిష్టించారు.
అనంతరం వేప మండలు, మామిడి మండలతో కట్టిన దండను పూజారులు వడ్డెలు మరియు ఆదివాసీ ఉపాద్యాయ సంఘ నాయకులతో కలిసి తోరణాన్ని కట్టారు. చంద్ర గ్రహణ సమయం ముగిసిన తర్వాత మండె మెలిగే పండగను ఆదివాసీ పూజారులు, వడ్డెలు ఆదివాసీ సాంప్రదాయ బద్ధంగా ఘనంగా నిర్వహించారు. గోదావరి జలాలతో శుద్ధి చేసిన నాగులమ్మకు చెందిన అడారాలను (కుండలు) పసుపు కుంకుమతో అలంకరించి ధూపం వేసి పూజలు చేసారు. అనంతరం నాగులమ్మ అమ్మవారికి చెందిన డాలు గుడ్డలకు ప్రత్యేక పూజలు చేసి వాటిని డోలు వాయిద్యాల నడుమ ఆదివాసీ సాంప్రదాయ బద్ధంగా ఆడించారు. అనంతరం మండె మెలిగె కార్యక్రమాన్ని ఆదివాసీ సాంప్రదాయ బద్ధంగా ప్రత్యేక పూజలతో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్ ట్రస్టీ, ఆలయ ప్రధాన పూజారి బాడిశ రామకృష్ణ స్వామీజీ (దేవర బాల ), పూజారులు బాడిశ నాగ రమేష్, కొమురం ధనలక్ష్మి, బాడిశ నవీన్, సోడి సత్యం, కుర్సం పుల్లయ్య, కట్టం సమ్మక్క, చౌళం భవాని, మడకం సుప్రజ, పోలిశెట్టి స్వరూప, వడ్డెలు కోర్స శ్రీకాంత్ , మూయబోయిన శివ, తుర్స చిన్నబ్బాయి, కారం రాజేష్ తదితరులు పాల్గొన్నారు.




