25-06-2025 01:35:36 AM
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఉధృతం చేసేలా జూలై మొదటి వారంలో రాష్ర్టవ్యాప్తంగా జాతీయ రహదారులను దిగ్భందిస్తా మని, రాష్ర్టంలో ఎక్కడికక్కడ బీసీ ద్రోహుల పార్టీ కార్యాలయాలను ముట్టడించి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెబుతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.
బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచే అధికారం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఉన్నప్పటికీ, రాష్ర్టంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు పెంచి స్థానిక సంస్థల ఎన్నికలు తక్షణమే నిర్వహించాలని బీజేపీ నేతలు రాష్ర్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందని, బీసీల విషయంలో బీజేపీ రెండు నాల్కల ధోరణిని పాటిస్తుందని శ్రీనివాస్ గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో ఆరోపించారు.
ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘తక్షణమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, అలాగే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచాలని’ డిమాండ్ చేశారని.. తమిళనాడు రాష్ర్ట తరహాలోనే కేంద్ర ప్రభు త్వం బీసీ రిజర్వేషన్లును 9వ షెడ్యూల్లో చేర్చి అమలు చేయాల్సి ఉంటుందని తెలిసి కూడా ఇవేమీ పరిగణలోకి తీసుకోకుండా బీసీలను మోసం చేసే విధంగా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.