29-06-2025 12:54:16 AM
నెరవేరుతున్న ఇందూరువాసుల కల
నిజామాబాద్, జూన్ 28 (విజయక్రాం తి): నిజామాబాద్ జిల్లా ప్రజల పసుపు బోర్డు ఆకాంక్ష నెరవేరనుంది. నాలుగు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రైతుల పసుపు బోర్డు కోరిక నెరవేరే తరుణం ఆసన్నమైంది. పసుపు బోర్డు ప్రారంభోత్సవం కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం నిజామాబాద్ జిల్లాకు రానున్నారు. మధ్యాహ్నం నగరంలోని వినాయక్ నగర్లో ఏర్పాటుచేసిన కేంద్ర పసుపు బోర్డు కార్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తారు.
అనంతరం స్థానిక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన అధికారుల సమావేశంలో ఆయన ప్రసంగిస్తారు. అనంతరం నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ బైపాస్ రోడ్డు చౌరస్తాలో ఏర్పాటు చేసిన డీ శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం పాలిటెక్నిక్ మైదానంలో ఏర్పాటు చేసిన రైతు సమ్మేళనంలో పాల్గొంటారు.