29-06-2025 12:55:36 AM
చావుకు భయపడే వ్యక్తిని కాను
కాంగ్రెస్ పెద్దలంటే అపారమైన గౌరవం ఉంది
మీడియాతో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి
హైదరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి): ఎల్లకాలం రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండాలని, తనను రెచ్చగొట్టొద్దని, తాను చావుకు భయపడే వ్యక్తిని కానని మాజీ ఎమ్మె ల్సీ, మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో పరోక్షంగా సొంత పార్టీలోని ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులకు సవాల్ విసిరారు. శనివా రం గాంధీభవన్లో పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవిని కొండా మురళి కలిశారు.
ఈ మేరకు ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీలోని విబేధాలు, జరుగుతున్న తాజా పరిణామాలపై మొత్తం ఆరు పేజీలతో కూడిన లేఖను క్రమశిక్షణ కమిటీకి అందజేశారు. అనంతరం కొండా మురళి మీడియాతో మాట్లాడారు. భారతదేశంలో ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా గెలిచిన వ్యక్తిని తానేనని తెలిపారు. బీసీలకు న్యాయం చేసే పనిలో తాను నిత్యం బిజీగా ఉంటానని, కాంగ్రెస్ పెద్దలంటే తనకు అపారమైన గౌరవం ఉందని తెలిపారు.
తనను ఎవరూ ఎలాంటి ప్రశ్నలు అడగలేదని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి చేయడమే తన ముందున్న లక్ష్యమని పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ లో జరుగుతోన్న పరిణామాలపై పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి అన్ని విషయా లు వివరించానని వెల్లడించారు.