16-06-2025 02:33:08 AM
శేరిలింగంపల్లి, జూన్ 15: ప్రకృతి ప్రేమికుడు, పర్యావరణ పరిరక్షకుడు నాగార్జున కన్స్ట్రక్షన్స్ అధినేత డాక్టర్ అల్లూరి వెంకట సత్యనారాయణ (ఏవీఎస్) రాజు అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొనియాడారు. కంపెనీ నిర్మాణ పనుల్లో భాగంగా ఏదైనా చెట్టు నరకాల్సి వస్తే, అందుకు ప్రతిగా వందల సంఖ్యలో చెట్లు నాటించిన సహృదయుడు ఏవీఎస్ రాజు అని శ్లాఘించారు.
హైదరాబాద్లోని ఓ వేదికపై ఆదివారం ఆయన ఏవీఎస్ రచన ‘శిఖరాయమానుడు’ పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడా రు. వ్యాపారంలో విలువలు, ప్రమాణాలను తు.చ. తప్పకుండా పాటించే వ్యాపార వేత్త ఏవీఎస్ రాజు అని పేర్కొన్నారు. ఆయన వ్యాపార ప్రస్థానం ఔత్సాహి క వ్యాపారవేత్తలకు ఆదర్శప్రాయమన్నారు. ‘శిఖరాయమానుడు’ ఆత్మకథ పుస్తకం కేవలం ఏవీఎస్ రాజు జీవితాన్ని మాత్రమే కాకుండా, నిర్మాణ రంగంలో భారత్ సాధించిన అభివృద్ధిని కూడా వివరిస్తుందని వెల్లడించారు.
ఏవీఎస్ రాజులో సామాజిక స్పృహ ఉందని, తోటివారితో ఆయన వినయపూర్వకంగా నడచుకుంటారని కొనియాడారు. ప్రకృతితో మమే కం కావడం ఏవీఎస్కు ఎంతో ఇష్టమన్నారు. ఆయన సమయపాలనను ప్రతిఒక్క రూ అలవరచుకోవాలని పిలుపునిచ్చారు. ఎంత టి ఉన్నత స్థాయికి ఎదిగినా, తెలుగుదనాన్ని వీడని తెలుగు భాషా ప్రేమికుడు ఏవీఎస్ రాజు అని కితాబునిచ్చారు.
భారత్ శతాబ్దాల క్రితమే విశ్వగురువు అని, అందుకు నిదర్శనాలే నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలని గుర్తుచేశారు. నేటి పిల్లలు శివాజీ, మహారాణా ప్రతాప్ సింగ్ వంటి వీరుల జీవిత చరిత్రలను చదువుకోవాలని అభిప్రాయపడ్డారు. వారి గురించి పాఠ్యాంశాల్లోనూ చేర్చాల్సి ఉందన్నారు.
మనిషి ఎదిగితే చిరునామా మారాలే కానీ, అతడి అస్తిత్వం మారకూడదన్నారు. అదే సిద్ధాంతాన్ని ఏవీఎస్ రాజు పాటించారని, తన ఆహార్యంలో ఎల్లప్పుడూ తెలుగుద నమే గోచరిస్తుందన్నారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, వ్యాపారవేత్తలు, సాహితీప్రియులు పాల్గొన్నారు.