23-02-2026 12:00:24 AM
అశ్వాపురం, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): మొండికుంట గ్రామపంచాయతీ పరిధిలోని భీమునిగుండంబీజీ కొత్తూరు గ్రామంలో నవోదయ విద్యాలయం స్థాపనకు శ్రీకారం చుట్టబడింది. ఈ విద్యాలయం నిర్మాణానికి అవసరమైన సర్వే నంబర్ 997లోని 33 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా అప్పగించింది. భూమి బదిలీ అనంతరం సుమారు రూ.80 కోట్ల అంచనా వ్యయంతో విద్యాలయ నిర్మాణ బాధ్యతను కేంద్రీయ విద్యాసంస్థల నిర్మాణంలో అగ్రగామి సంస్థ అయిన ఎన్బీసీసీ (NBCC)కు అప్పగించారు.
దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ఒడిశాలోని సంబల్పూర్ ఐఐటి, మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్ సహా అనేక కేంద్రీయ విద్యాలయాల నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేసిన సంస్థగా ఎన్బీసీసీ గుర్తింపు పొందింది. విద్యాలయ స్థలానికి రవాణా సౌకర్యం కల్పించేందుకు కొత్తగూడెంమణుగూరు ప్రధాన రహదారి నుండి బీజీ కొత్తూరు మీదుగా 2.5 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి నిధులు మంజూరై పనులు పురోగమిస్తున్నాయి.
అలాగే నిరంతరాయ త్రీఫేజ్ విద్యుత్ సరఫరా కోసం 11 కేవీ విద్యుత్ లైన్ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్బీసీసీ నిర్మాణ సంస్థ ప్రతినిధులు కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. విద్యుత్, తాగునీటి సదుపాయాలు పూర్తయిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని వారు వెల్లడించారు. నవోదయ విద్యాలయం ప్రారంభం కావడంతో ఈ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందుబాటులోకి రానుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.