24-06-2025 12:51:23 AM
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
జూన్ 23(విజయక్రాంతి): చిరు ధాన్యాల ఆహారాన్నిప్రజలు స్వీకరించడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం మన సొంతమవుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో ప్రతి సోమవారం చిన్నశంకరంపేట మండలం ఇందిరా మహిళా శక్తి ద్వారా ఏర్పాటు చేసిన చిరు ధాన్యాల స్టాల్ ను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి శంకరంపేట మండలం మహిళ ద్వారా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన చిరు ధాన్యాల స్టాల్ సందర్శించడం జరిగిందని, బ్రాండింగ్ (నిర్దిష్ట పేరు) కల్పించినట్లయితే మార్కెటింగ్ సౌకర్యం పెరుగుతుందని తెలిపారు. మిల్లెట్స్ గ్రామీణ ప్రాంత ప్రజలు మాత్రమే వాడతారని ఒక అపోగా ఉండేదని, కాలక్రమేణ చిరు ధాన్యాల ప్రాధాన్యత, పట్టణ ప్రాంతవాసులు ఆదరణ పెరిగి వారు వినియోగించి ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు.
జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో హైదరాబాదులో మిల్లెట్ స్టాల్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ప్రతి సోమవారం ప్రజావాణికి వచ్చిన ప్రజలే కాకుండా వివిధ శాఖల అధికారులు సిరి ధాన్యాల స్టాల్ సందర్శించి కొనుగోలు చేయడం ద్వారా మహిళలకు ఉపాధి మార్గాలు చేకూరుతున్నాయని తెలిపారు
కోటి మహిళలను కోటీశ్వరులను చేయాలని ప్రభుత్వ లక్ష్యాల మేరకు మహిళా సాధికారత ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్ ,డిఆర్డిఓ శ్రీనివాసరావు, జెడ్పి సీఈఓ ఎల్లయ్య, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.