29 April, 2026 | 2:37 AM

కొత్త కలెక్టరేట్ సిద్ధం

29-04-2026 01:00 AM

రాష్ట్ర అవతరణ రోజు అందుబాటులోకి నయా బిల్డింగ్

కరీంనగర్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి) : కరీంనగర్ జిల్లా కొత్త సమీకృత కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. 51 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ అత్యాధునిక భవనాన్ని రాష్ట్ర అవతరణ రోజు జూన్ 2న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించే అవకాశం ఉంది. ఈ నూతన సముదాయం అందుబాటులోకి వస్తే జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాలు ఒకే ప్రాంగణంలో పని చేస్తాయి. దీనివల్ల ప్రజలు తమ పనుల కోసం వివిధ ప్రాంతాలకు తిరిగే ఇబ్బంది తప్పుతుంది.

2021లో ప్రారంభమైన ఈ భవన నిర్మాణాన్ని ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పూర్తి చేయించింది. పాత కలెక్టరేట్ భవనం ఇంకా పటిష్టంగా ఉండటంతో దానిని కూల్చకుండా ఇతర ప్రభుత్వ అవసరాలకు వాడుకోవాలని నిర్ణయించారు. ఈ నూతన భవనం ఒక కార్యాలయం మాత్రమే కాదు.. జిల్లా పరిపాలనలో సరికొత్త అధ్యాయానికి వేదిక కాబోతోంది.కరీంనగర్ కలెక్టరేట్ పనులు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి. భవనం లోపల సీలింగ్ పనులు, విద్యుత్ అమరికలు పూర్తయ్యాయి.

ఆవరణలో పచ్చదనం తో పాటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అత్యంత సుందరంగా ఏర్పాటు చేశారు. వాహనాల రాకపోకల కోసం నిర్మించిన సీసీ రోడ్ల పనులు కూడా ముగిశాయి. ఈ భవన నిర్మాణ ప్రయాణం 2021 డిసెంబర్ నెలలో అప్పటి ప్రభుత్వ హయాంలో ప్రారంభమైంది. సుమారు 51 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో దీనిని చేపట్టారు. మొదట్లో ఏడాదిలోనే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. వివిధ కారణాల వల్ల పనులు ఆలస్యమవుతూ వచ్చాయి.

గత ఏడాది ఎన్నికలకు ముందు పనులు కొంత వేగవంతం అయ్యాయి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, పాలనను ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో పెండింగ్లో ఉన్న కలెక్టరేట్ పనులపై ప్రత్యేక దృష్టి సారించింది. నిధుల విడుదల, పర్యవేక్షణ పెంచడంతో ఇప్పుడు ఈ భవనం ప్రారంభానికి సిద్ధమైంది.ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో అనేక ప్రభుత్వ కార్యాలయాలు వేర్వేరు ప్రాంతాల్లో.. కొన్నభవనాల్లో కొనసాగుతున్నాయి.

దీనివల్ల సామాన్య ప్రజలు తమ పనుల కోసం ఒక కార్యాలయం నుంచి మరో కార్యాలయానికి కిలోమీటర్ల దూరం తిరగాల్సి వస్తోంది. ఈ కొత్త సమీకృత భవనం అందుబాటులోకి వస్తే.. రెవెన్యూ, వ్యవసాయం, సంక్షేమ, ఇతర ముఖ్యమైన శాఖలన్నీ ఒకే ప్రాంగణంలో ఉండటం వల్ల ప్రజలకు సమయం ఆదా అవుతుంది.

ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్న కార్యాలయాలను ఇక్కడికి తరలించడం వల్ల ప్రభుత్వానికి ఏటా లక్షలాది రూపాయల అద్దె భారం తప్పుతుంది. విశాలమైన మీటింగ్ హాళ్లు, వీడియో కాన్ఫరెన్స్ గదులు, సందర్శకుల కోసం ప్రత్యేక వేచి ఉండే గదులు ఈ భవనంలో అందుబాటులో ఉన్నాయి.

దృడంగా పాత భవనం

కొత్త భవనం పూర్తయ్యాక పాత కలెక్టరేట్ను పూర్తిగా కూల్చివేస్తారని అందరూ భావించారు. అయితే.. రోడ్లు, భవనాల శాఖ ఇంజినీర్లు ఆ భవనాన్ని పరిశీలించి. పాత భవనం ఇంకా దృఢంగా ఉందని.. మరో 30 ఏళ్ల పాటు దీనిని నిరభ్యంతరంగా వాడుకోవచ్చని తేల్చారు. దీంతో ఆ భవనాన్ని కూల్చకుండా.. జిల్లాలోని ఇతర ప్రభుత్వ అవసరాలకు లేదా స్వయం సహాయక సంఘాల కార్యకలాపాలకు వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది.

బ్యాలెన్స్ వర్క్ సత్వరమే పూర్తి కావాలి జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశం 

నూతనంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కాంప్లెక్స్ బ్యాలెన్స్ పనులను సత్వరమే పూర్తి చేయాలి. జూన్ రెండులోగా ప్రారంభానికి కాంప్లెక్స్ ను అన్ని రకాలుగా సిద్ధం చేసి ఉంచాలి. యుద్ధ ప్రాతిపదికన మిగిలిన పనులు పూర్తి చేయాలి. పనులు పూర్తిచేసి ప్రారంభానికి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.