calender_icon.png 19 February, 2026 | 6:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త ప్రయాణం

19-02-2026 03:01:01 AM

నిత్యామీనన్ తన మరో ప్రయాణాన్ని ప్రారంభించారు. నటిగా ఇప్పటికే విభిన్న పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె నిర్మాతగా మారుతున్నారు. ‘కేయూరి ప్రొడక్షన్స్’ పేరుతో తన సొంత నిర్మాణ సంస్థను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన ఓ ప్రత్యేక వీడియోలో తన నిర్మాణ సంస్థ లక్ష్యాలు, దక్పథం గురించి నిత్యామీనన్ వివరించారు.

కేవలం వాణిజ్యపరమైన సినిమాలకే పరిమితం కాకుండా, బలమైన కథా నేపథ్యం ఉన్న చిత్రాలు, లోతైన భావోద్వేగాలను కలిగించే పాత్రలు, సమాజంపై ప్రభావం చూపగల కథాంశాలకే తన బ్యానర్ ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. సినిమా అనేది కేవలం వినోదం మాత్రమే కాదని, అది ప్రేక్షకులతో ఒక భావోద్వేగ బంధాన్ని ఏర్పరచే శక్తి కలిగిన మాధ్యమమని ఆమె అభిప్రాయపడ్డారు.

గత ఏడాది వరుసగా మూడు విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన నిత్యా ఇప్పుడు నిర్మాతగా కూడా తన ముద్ర వేయాలని చూస్తున్నారు. విభిన్న కథలను ఎంచుకోవడంలో, ప్రయోగాత్మక పాత్రలను పోషించడంలో నిత్యామీనన్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఇదే ధోరణిని నిర్మాతగానూ కొనసాగిస్తారని, కొత్త తరహా కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారని అందరూ భావిస్తున్నారు.