calender_icon.png 29 June, 2025 | 6:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్సిటీలకు కొత్త ఆచార్యులు!

29-06-2025 12:54:03 AM

  1. నాలుగు వర్సిటీల్లో నియామకాలకు లైన్ క్లియర్
  2. పోస్టుల భర్తీకి వర్సిటీ పాలకమండళ్ల ఆమోదం 
  3. త్వరలో మరికొన్ని వర్సీటీల్లో నియామకాలకు నిర్ణయం

హైదరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి): త్వరలోనే యూనివర్సిటీలకు నూతన ప్రొఫెసర్లు రాబోతున్నారు. ఇందుకు సంబంధిం చిన ప్రక్రియలో విద్యాశాఖ ఉన్నతాధికారులు, వర్సిటీ అధికారులు వేగం పెంచారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి నూతన మార్గదర్శకాలతో ఏప్రిల్ 4నే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా ఆయా వర్సిటీలు పోస్టుల భర్తీకి ముందుకొస్తున్నాయి. ఈమేరకు నాలుగు వర్సిటీల పాలకమండళ్లు నియామకాలకు ఇటీవల ఆమోదం తెలిపాయి.

త్వరలో మరికొన్ని వర్సిటీలు ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి పాలకమండళ్ల సమావేశాలను నిర్వహించి నియా మక ప్రక్రియపై నిర్ణయం తీసుకోనున్నాయి. రాష్ట్రంలోని వర్సిటీల్లో 2,876 పోస్టులకు 2,123 వరకు ఖాళీలే ఉన్నాయి. ఈ ఖాళీలను ఒకేసారి భర్తీ చేయకుండా.. రెండు, మూడు దఫాల్లో భర్తీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. తొలుత విద్యార్థు లెక్కువ, డిమాండ్ ఉన్న కోర్సుల్లో సరిపడా ప్రొఫెసర్లు ఉండేలా నియామకాలను చేపట్టాలని భావిస్తున్నారు.

పన్నేండేళ్లుగా నియామకాల్లేవ్

రాష్ట్రంలో విద్యాశాఖ పరిధిలో 12 వర్సిటీలున్నాయి. వీటిలో పన్నేండేళ్లుగా నియా మకాలే చేపట్టలేదు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం నియామకాలను చేపట్టాలని భావించింది కానీ అది ముందుకు సాగలేదు. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వర్సిటీల్లోని ఖాళీలపై దృష్టి సారించి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియకు చర్యలు చేపట్టింది. ఈక్రమంలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసేందుకు గత ఏప్రిల్‌లో మార్గదర్శకాలను జారీ చేసింది.

దీంతో వర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ప్రొఫెసర్లు తమను రెగ్యులరైజ్ చేశాకే భర్తీ ప్రక్రియను చేపట్టాలని సమ్మె చేపట్టగా, అందుకు ప్రభుత్వం వారిని ఉద్యోగాల నుంచి తీసేయబోమని హామీ ఇవ్వడంతో ఆ ఆందోళన సద్దుమనిగింది.

ఈక్రమంలోనే నియామక ప్రక్రియను చేపట్టేందుకు వీలుగా ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, శాతవాహన వర్సిటీల పాలకమండళ్లు సమావే శాలను నిర్వహించి ఖాళీలను భర్తీ చేయాలని ఆమోదం తెలిపినట్టు సమాచారం. ఈ వర్సిటీల్లో మొత్తం 460కిపైగా పోస్టులను భర్తీ చేయనున్నారు. రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లు అమలుకు కొంత సమయం పట్టనుంది. ఆ తర్వాతే నోటిఫికేషన్లు జారీ, భర్తీ ప్రక్రియను చేపట్టే అవకాశముంది.