ఓరుగల్లులో నిత్య పెళ్లి కొడుకు

24-04-2024 01:31:07 AM

ఐదు పెళ్లిళ్లు చేసుకున్న ఘనుడు

ఐదో పెళ్లి తర్వాత బయటపడ్డ బండారం 

వరంగల్ తూర్పు, ఏప్రిల్ 23 : ఒకరికి తెలియకుండా మరొకరిని.. అలా ఐదుగురిని పెళ్లి చేసుకున్న నిత్య పెళ్లి కొడుకు బండారం ఎట్ట కేలకు బయటపడింది. ఫిబ్రవరిలో వరంగల్‌లోని సుందరయ్యనగర్ కు చెందిన సారిక అనే అమ్మాయిని ఇంట్లో నుంచి తీసుకెళ్లి రాజేశ్ అనే వ్యక్తి వివాహం చేసుకున్నాడు.  సారిక కోసం ఆమె తల్లిదండ్రులు వెతక సాగారు. ఈ క్రమంలో సారిక తల్లిదండ్రులు రాజేశ్ గురించి ఆరా తీశారు. రాజేష్ అప్పటికే నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న వ్యవహారం బయటపడింది. ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుని వేర్వేరు చోట్ల కాపురాలు పెట్టి ఎవరికి అనుమానం రాకుండా ఇన్నాళ్లు రాజేశ్ కథ నడిపించాడని తెలిసింది. చివరికి ఐదో వివాహం చేసుకున్న తర్వాత అతని భాగోతం బయటపడింది. తమ కూతురిని మోసం చేసి వివాహం చేసుకున్న రాజేశ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సారిక  తల్లిదండ్రులు కోరుతున్నారు. తమ వద్ద నిందితుడి పెళ్లిళ్లకు సంబంధించిన పూర్తి ఆధారాలు ఉన్నాయని, న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించనున్నట్టు బాధితురాలి బంధువులు పేర్కొన్నారు.