1 July, 2026 | 7:52 AM

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు

12-05-2026 09:02 PM

దాసాంజనేయస్వామి వారికి ఏకాంత విశేష స్నపనం

భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాచంలో హనుమాన్‌ దీక్షల విరమణ మంగళవారం గనంగా జరిగింది.  తెల్లవారుజామున 3 గంటలకే రామాలయాన్ని తెరిచి సుప్రభాత సేవ నిర్వహించారు. అదేవిధంగా హనుమాన్‌ దీక్షితులు వేకువ జాము నుంచే పవిత్ర గోదావరి నదికి చేరుకొని పుణ్య స్నానాలు ఆచరించారు. జై శ్రీరామ్‌. జై హనుమాన్‌,  జై శ్రీరామ్‌ జైజై శ్రీరామ్‌ అంటూ మస్మరణతో తమ ఆరాధ్య దైవమైన భద్రాద్రి రామయ్యను దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. హనుమాన్‌ దీక్షితులు తమ శిరస్సుపై ఇరుముడి ధరించి  తెల్లవారుజామున మూడు గంటల నుంచే క్యూ లైన్లలో బారులు తీరారు.

స్వామి వారిని దర్శించుకున్న తరువాత ఇరుముడిని అంజనే యస్వామి ఆలయంలో సమర్పించారు. కాగా దేవస్థానం అధికారులు హనుమాన్‌ భక్తుల కోసం శీఘ్ర దర్శనం, దేవస్థానం ఉచిత నిత్యన్నదాన సత్రంలో అన్న ప్రసాద అందిచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వరంగల్‌, కరీంనగర్‌, నిజామా బాద్‌, ఆదిలాబాద్‌ తదితర ఉమ్మడి జిల్లాల నుంచి వేల సంఖ్యలో తరలొచ్చారు.  సుమారు 30 వేల మంది హనుమాన్‌ దీక్షితులు దర్శించుకున్నట్లు దేవస్థానం వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే దాసాంజనేయస్వామికి ఏకాంత విశేష స్నపనం నిర్వహించారు.

వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు భద్రాదలంలోని బ్రిడ్జి సెంటర్‌ వద్ద  ఉన్న అభయాంజనేయస్వామి ఆలయంలో కూడా దీక్షా విరమణ గావించారు. ఈ సందర్భంగా అభయాంజనేయ స్వామి ఆలయంలో వైదిక సిబ్బంది సమక్షంలో హనుమాన్‌ దీక్షితుల విరమణ కోసం ప్రత్యేక పూజ, హనుమత్‌ హోమం, సామూహిక సహస్రనామార్చన పూజలు నిర్వహించారు. హనుమాన్‌ భక్తులు దీక్షా విరమణ గావించారు. తాతగుడి సెంటర్లో, వెంకటేశ్వర కాలనీలోని ఆంజనేయస్వామి వారి ఆలయాల్లో కూడా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు అన్నదానం నిర్వహింవారు.