21-11-2025 01:08:07 AM
రాష్ట్రపతి, గవర్నర్లకు న్యాయస్థానం గడువు విధించడం సబబుకాదు
బిల్లుల అంశంపై సుప్రీం కీలక తీర్పు
గవర్నర్లకు మూడు మార్గాలు..
1. బిల్లులకు సమ్మతి తెలియజేయడం.
2. కారణం చెప్పి బిల్లును పెండింగ్ పెట్టడం లేదా రాష్ట్రపతికి పంపడం.
3. బిల్లును తిరస్కరించి, అసెంబ్లీకి పంపడం.
న్యూఢిల్లీ, నవంబర్ 20 : రాష్ట్రాల శాసన సభలు పంపించిన బిల్లులకు ఆమోదం తెలిపే అంశంలో సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు నిచ్చింది. ఈ విష యంలో రాష్ట్రపతి, గవర్నర్లకు న్యాయస్థానం గడువు విధించడంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంధించిన ప్రశ్నల (ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్)పై అత్యున్నత న్యాయస్థానం సమాధానమిచ్చింది. పెండింగ్ బిల్లుల ఆమోదం కోసం రాష్ట్రపతి, గవర్నర్లకు గడువును విధించడం తగదని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మా సనం స్పష్టంచేసింది.
అయితే, కారణం చెప్పకుండా గవర్నర్లు బిల్లులను వెనక్కి పంపలేరని వెల్లడించింది. ఈ మేరకు గతంలో ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సీజేఐ ధర్మాసనం పక్కనబెట్టింది. గవర్నర్కు రాజ్యాంగపరంగా మూడు మార్గాలు ఉంటాయని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా తెలిపింది. అవి, 1. బిల్లులకు సమ్మతి తెలియజేయడం 2. కారణం చెప్పి బిల్లును పెండింగ్ పెట్టడం లేదా రాష్ట్రపతికి పంపడం 3. బిల్లును తిరస్కరించి, అసెంబ్లీకి పంపడం.
ఈ మూడు ఆప్షన్లు ఎంచుకోవడంలో గవర్నర్ విచక్షణాధికారాన్ని ఉపయోగిస్తారని, ఇందుకు న్యాయస్థానాలు గడువు విధించడం సబబు కాదని పేర్కొంది. గవర్నర్ల విధుల నిర్వహణ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవని, కానీ.. కారణం లేకుండా దీర్ఘకాలంగా బిల్లులను పెండింగ్లో ఉంచిన సందర్భాల్లో కోర్టులు పరిమిత విచక్షణతో వ్యవహరించవచ్చునని తెలిపింది.
రాష్ట్రపతి విషయంలోనూ ఇదే వర్తిస్తుందని పేర్కొంది. గవర్నర్ బిల్లును రాష్ట్రపతికి రిజర్వ్ చేసిన ప్రతిసారీ ఆర్టికల్ 143 కింద రాష్ట్రపతి సుప్రీంను సంప్రదించాల్సిన అవసరం లేదని, ఆర్టికల్ 200 కింద గవర్నర్లకు విచక్షణాధికారం ఉంటుందే తప్ప.. దాన్ని అపరిమితంగా వినియోగించలేరని పేర్కొంది.
శాసనసభలు ఒకటికి రెండుసార్లు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు ఆమో దం తెలపకుండా కాలయాపన చేయడం, రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నవి కూడా తీవ్ర జాప్యానికి గురికావడంపై ఈ ఏడాది ఏప్రిల్లో సుప్రీంకోర్టు సంచలన నిర్ణ యం తీసుకున్న సంగతి తెలిసిందే. గతం లో ఎన్నడూ లేనివిధంగా ఈ అంశంలో గవర్నర్తో పాటు రాష్ట్రపతికీ గడువు విధించింది.
గరిష్ఠంగా మూడు నెలల్లోగా ఆ బిల్లులను ఆమోదించడమో, తిప్పి పంపించడమో చేయాలని జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్ ధర్మాసనం నిర్దేశించింది. దీంతో రాజ్యాంగ అధికరణం 143(1) ప్రకారం తనకున్న అధికారాన్ని వినియోగిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మే నెలలో పలు ప్రశ్నలతో సీజేఐకి లేఖ రాశారు.
రాష్ట్రపతి విచక్షణ అధికారాల పరిధిలోకి వచ్చే రాష్ట్రాల బిల్లులకు ఆమోదం తెలిపే అంశంలో న్యాయస్థానం గడువు విధించడం ఎంతవరకు న్యాయ సమ్మతమో తెలపాలంటూ సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరారు. దీనిపై సీజేఐ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైం ది. పది రోజుల పాటు అన్ని పక్షాల వాదనలను విన్న ధర్మాసనం సెప్టెంబరు 11న తీర్పు రిజర్వు చేసింది. ఈ విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించలేమంటూ తాజా గా తీర్పు వెలువరించింది.