14-11-2025 08:15:16 PM
జిల్లాలో డయాబెటిస్ రోగులెవరూ "దృష్టి" రెటినోపతి స్క్రీనింగ్ నుండి మిస్ కావొద్దు : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి క్రైమ్ : వనపర్తి జిల్లాలో డయాబెటిస్ రోగులందరూ "దృష్టి" రెటినోపతి స్క్రీనింగ్ ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. జిల్లాలో కలెక్టర్ ప్రత్యేక చొరవతో మధుమేహ వ్యాధిగ్రస్తులకు "దృష్టి" కార్యక్రమం పేరుతో వంద రోజులపాటు నిర్వహించనున్నారు. శుక్రవారం ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా గాంధీనగర్ ఆసుపత్రిలో "దృష్టి" రెటినోపతి స్క్రీనింగ్ శిబిరాన్ని కలెక్టర్ రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచంలో అత్యధికమంది ప్రస్తుతం డయాబెటిస్ బారిన బాధపడుతున్నారు.
డయాబెటిస్ వచ్చిన వారిలో కంటిచూపు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని, ఆ సమస్యలను జటిలం కాకుండా రెటినోపతి స్క్రీనింగ్ ద్వారా నిర్ధారణ చేసుకొని చికిత్స పొందవచ్చని తెలిపారు. ఇప్పుడు జిల్లాలోని మధుమేహంతో బాధపడుతున్న వారందరికీ ఉచితంగా రెటినోపతి స్క్రీనింగ్ చేసేందుకు శ్రీకారం చుట్టామని దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. అన్ని పీహెచ్సిల పరిధిలో స్క్రీనింగ్ చేయడం జరుగుతుందని మధుమేహ వ్యాధిగ్రస్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
రెటినోపతి స్క్రీనింగ్ కోసం ప్రత్యేకంగా పరికరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, కంటి వైద్య నిపుణులు శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ స్క్రీనింగ్ చేసి చికిత్సలు అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ స్క్రీనింగ్ చేయించుకోవాలంటే కనీసం మూడు నుంచి నాలుగు వేల రూపాయలు వసూలు చేయడం జరుగుతుందని, ఇప్పుడు ప్రభుత్వం ప్రజల కోసం ఉచితంగా ఈ అవకాశాన్ని అందిస్తుందని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా అక్కడికి స్క్రీనింగ్ కోసం శిబిరానికి వచ్చిన మధుమేహ యాదిగ్రస్తులతో కలెక్టర్ మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఒక డయాబెటిస్ పేషెంట్ కు రెటినోపతి స్క్రీనింగ్ చేయడాన్ని పరిశీలించి రిపోర్టు వచ్చిన అనంతరం అతనికి రిపోర్టును అందజేసి వివరాలను తెలియజేశారు.
ఉచిత వైద్య శిబిరానికి హాజరైన కలెక్టర్
వనపర్తి పట్టణాన్ని అత్యంత సుందరంగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దడంలో మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికుల ది కీలక పాత్ర అని జిల్లా కలెక్టర్ అన్నారు. కార్మికులందరూ తమ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా పురపాలక కార్యాలయ సమావేశ మందిరంలో సాయి రత్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు.
మున్సిపాలిటీ కార్మికులందరూ తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని మధుమేహం బారిన పడకుండా జాగ్రత్త పడాలని సూచించారు. ఇప్పటికే మధుమేహం వ్యాధి బారిన ఎవరైనా పడి ఉంటే జిల్లాలో రెటినోపతి స్క్రీనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆ శిబిరానికి వెళ్లి స్క్రీనింగ్ చేయించుకుని కంటి సమస్యలు లేకుండా కాపాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ యాదయ్య, డిఎంహెచ్ఓ సాయినాథ్ రెడ్డి, కంటి వైద్య నిపుణులు శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, తహసిల్దార్ రమేష్ రెడ్డి, మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.