మందిర్-మసీదు వివాదాలు వద్దు
- సామరస్యంలో దేశాన్ని రోల్ మోడల్గా నిలపాలి
- ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్
న్యూఢిల్లీ, డిసెంబర్ 20: దేశంలో రోజు రోజుకీ పెరుగుతున్న మందిర్-మసీదు వివాదాలపై రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. రామమందిరం నిర్మాణం తర్వాత కొత్త ప్రదేశాల్లో ఈ తరహా సమస్యలను లేవనెత్తడం ద్వారా హిందువులకు నాయకులు గా మారొచ్చని కొందరు భావిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పూణేలోని ‘విశ్వగురు భారత్’ అనే అంశంపై సహజీవన్ వ్యాఖ్యానాల కార్యక్రమంలో పాల్గొన్న భగవత్.. ఈ తరహా వివాదాలను లేవనెత్తడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. రోజుకో వివాదం పుట్టుకొస్తుంటే వాటిని ఎలా అనుమతించగలం అని ఆయన ప్రశ్నించారు. మనమందరం కలిసి జీ వించగలమే విషయాన్ని ప్రపంచానికి చూ పించాలని పిలుపునిచ్చారు.
సమగ్రత, సామరస్యం విషయంలో భారత్ను ప్రపంచం ముందు ఆదర్శంగా నిలపాలన్నారు. భారతీయులు మునుపటి తప్పులను నుంచి పాఠాలను నేర్చుకుని దేశాన్ని ప్రపంచానికి రోల్ మోడల్గా మార్చడానికి కృషి చేయాల ని కోరారు. తాము హిందువులం కాబట్టే రా మకృష్ణ మిషన్లో కూడా క్రిస్మస్ వేడుకలు చేసుకుంటామని పేర్కొన్నారు.
అయోధ్యలోని రామమందిరాన్ని హిందువులకే ఇవ్వాలని నిర్ణయం తీసుకునే సమయంలో బ్రిటీష్ వాళ్లు రెండు వర్గాల మధ్య గొడవలు సృష్టించారని ఈ సందర్భంగా భగవత్ గుర్తు చేశారు. ఆ గొడవలు క్రమంగా వేర్పాటువాదానికి దారితీసి పాకిస్థాన్ ఏర్పాటుకు కార్యరూపం దాల్చాయని తెలిపారు. ఎవరో ఒకరు ఆధిపత్యం చేసే రోజులు ఎప్పుడో పోయాయన్నారు.
ప్రస్తుతం ప్రభుత్వాన్ని నడిపే ప్రజాప్రతినిధులను ప్రజలే ఎన్నుకుంటున్నారని గుర్తుచేశారు. ప్రతిఒక్కరూ తమను తాము భారతీయులుగా చెప్పుకొంటున్నప్పుడు ఆధిపత్యం ఎందుకు? మైనార్టీ ఎవరు? మెజార్టీ ఎవరు? అని ఆయన ప్రశ్నించారు.
అందరూ సమానమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. ఎవరికి ఇష్టమైన దేవుణ్ణి వాళ్లు పూజించడం ఈ దేశ ఆచారమన్నారు. అయితే నిబంధనలు, చట్టాలకు లోబడి సామరస్యంగా జీవించాల్సిన అవసరం ఉందన్నారు.






