12-08-2025 12:26:52 AM
కరీంనగర్, ఆగస్టు 11 (విజయక్రాంతి): మేడిగడ్డ వద్దనీటి నిల్వ ఉంచవచ్చా, ఉపయోగించుకోవచ్చా అనే అంశంపై డ్యాం సేఫ్టీ అథారిటీ నిర్ధారణ చేసి ఇచ్చిన నివేదిక ఆధారంగా ముందుకెళ్తామని, ఈ అంశంపై బీఆర్ఎస్ అనవసరంగా రాద్ధాంతం చేస్తుందని ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు.
సోమవారం కరీంనగర్లో సుడా నూతన కార్యాలయ భవన నిర్మాణానికి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యంలతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మీడియాతో మాట్లాడుతూ.. ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో మేడిగడ్డ లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముందు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామన్నారు.
తమ మేనిఫెస్టోలోనే కాళేశ్వరంపై జ్యూడిషియల్ ఎంక్వురై చేస్తామని చెప్పామని, కమిషన్ వేశామని, కమిషన్ నివేదికను అసెంబ్లీలో చర్చించిన తర్వాతే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. రాజ్యాంగ వ్యవస్థలపై తమకు నమ్మకం ఉన్నదని చెప్పారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లను శానసభలో ఆమోదించి గవర్నర్కు పంపించామని, ప్రస్తుతం రాష్ర్టపతి వద్ద, కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నదని పేర్కొన్నారు.
బీజేపీకి చెందిన 8 మంది ఎంపీలు బీసీ బిల్లును ఆమోదింపజేయాలని డిమాండ్ చేశారు. ఇటు బీజేపీ, అటు బీఆర్ఎస్కు బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేదని, జంతర్మంతర్ వద్ద తమ నిరసన ధర్నాకు మద్దతు పలకలేదని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు రిజర్వేషన్పై మాట్లాడితే ప్రజలు నమ్మరని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లతో ముందుకెళ్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎవరిని విచారణకు పిలవాలనేది సిట్ అధికారులు నిర్ణయిస్తారని, తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ విచారణలో రాజకీయ జోక్యం లేదని క్లారిటీ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్పై అధికారులే విచారణ చేస్తున్నారని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్తో లోపాయికారిగా ఒప్పందం చేసుకుందని విమర్శించారు. పార్టీ ఫిరాయింపుల అంశంపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ఎమ్మెల్యేలపై నిర్ణయం స్పీకర్దేనని వెల్లడించారు.
హైదరాబాద్, కరీంనగర్ ఇండస్ట్రియల్ కారిడార్పై ప్రభుత్వం ముందుకెళ్తుందని, పరిశ్రమలను ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. కరీంనగర్ నగరాన్ని మరింత అభివృద్ధి చేసే ఆలోచన చేస్తున్నామని, మధ్యలో ఆగిపోయిన మానేరు రివర్ ఫ్రంట్పై సమీక్ష జరిపి ముందుకెళ్తామని పేర్కొన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ కమిటీలు లేక ఇండ్ల పంపిణీ ఆగిపోయిన అంశంపై మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్లనిర్మాణం, ఇందిరమ్మ కమిటీల ఆధారంగా త్వరలోనే జరిపిస్తామని స్పష్టత ఇచ్చారు.