07-06-2025 12:00:00 AM
హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): రాజన్న కోడెలపై రాజకీయం చేయొద్దని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. గడిచిన పదేండ్లలో వేములవాడ ఆలయానికి ఏం చేశారో బీఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పాలని శుక్రవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేములవాడ ఆలయానికి నిధులు ప్రకటించి, ఒక్క పైసా కూడా ఇవ్వలేదని ఆరోపించారు.
నిధులు కేటాయించకపోవడంతోనే వేములవాడలో రాజన్న కోడెలకు ఈ దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కోడెల ఘటన జరిగిన వెంటనే తమ ప్రభుత్వం స్పందించిందన్నారు. అయినా, ప్రతిపక్షాలు ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు.
తమ హయాంలో సరస్వతీ పుష్కరాలను విజయవంతంగా నిర్వహించామని, 30 లక్షల మంది భక్తులు వచ్చినా ఎక్కడా చిన్న ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. యాదగిరిగుట్ట మీద కేసీఆర్ బొమ్మలను చెక్కించుకున్న వాళ్లకు.. దేవుళ్ల విషయంలో మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. యాదగిరిగుట్టకి తాము రూ.63 కేజీల బంగారంతో గోపురం తాపడం చేయించామని గుర్తుచేశారు.