05-02-2026 12:18:26 AM
మహబూబాబాద్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): జాతీయ రహదారి నుంచి తండా వరకు ప్రజలు రాకపోకలు సాగించడానికి సొంత భూమి నుంచి రోడ్డు వేసేందుకు అనుమతి ఇచ్చామని, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి పార్టీకి అవసరమైన ఫండ్ సమకూర్చామని, తమకు టికెట్ ఇస్తామని నామినేషన్ కూడా వేయించి బీఫామ్ ఇవ్వకుండా మోసం చేశారని కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ అభ్యర్థి నిరసన తెలిపారు. తమ భూమి నుంచి రాకపోకలు సాగించ వద్దంటూ రోడ్డును జేసిబీతో తవ్వారు.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణ పరిధిలో బుధ వారం జరిగింది. బానోతు బుజ్జి ఆమె కుమారు లు నరేష్, సురేష్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీ ఎన్నికల్లో తమకు రెండవ వార్డు కౌన్సిలర్గా పోటీ చేయడానికి టిక్కెట్ ఇస్తామని డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్, మరిపెడ మండల పార్టీ అధ్యక్షుడు పెండ్లి రఘువీరారెడ్డి హామీ ఇచ్చారని, ఆ మేరకు తాము నామినేషన్ కూడా దాఖలు చేశామన్నారు.
బీఫామ్ ఇవ్వలేదని బుజ్జి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కారణంగానే రోడ్డు కోసం ఇచ్చిన స్థలాన్ని వెనక్కి తీసుకుంటున్నామని, లేనిపక్షంలో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంటామని భీష్మించారు. ఈ విషయం తెలుసుకున్న తహసిల్దార్ కృష్ణవేణి, సీఐ రాజ్ కుమార్ గౌడ్ సంఘటన స్థలానికి చేరుకొని వారితో మాట్లాడి స్థానిక ప్రజలు ఇబ్బందు లు పడకుండా చూడాలని సర్దిచెప్పారు.