01-06-2025 06:13:01 PM
అధ్యక్ష స్థానానికి త్రిముఖ పోటీ..
ఏకగ్రీవం కానున్న ప్రధాన కార్యదర్శి పదవి..
మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని మార్కెట్ పద్మశాలి సంఘం(Padmashali Society) అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఎన్నికల కోసం నామినేషన్ల దాఖలు గడువు ఆదివారంతో ముగిసింది. తొలిరోజు అధ్యక్ష స్థానానికి అడిచెర్ల నాగేందర్, బత్తుల శ్రీనివాస్ లు, ప్రధాన కార్యదర్శి పదవికి దావనపెళ్లి తిరుపతి నామినేషన్ లు దాఖలు చేయగా చివరి రోజు ఆదివారం అధ్యక్ష స్థానానికి బత్తుల సతీష్ బాబు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ముగింపు సమయానికి ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ప్రధాన కార్యదర్శి పదవికి ఒకే ఒక్క నామినేషన్ దాఖలు కావడంతో అధ్యక్ష స్థానానికి త్రిముఖ పోటీ నెలకొనగా ప్రధాన కార్యదర్శి పదవికి నామినేషన్ వేసిన తిరుపతి ఏకగ్రీవంగా గెలువనున్నారు.
ఇదిలా ఉండగా నామినేషన్ ల ఉపసంహరణకు ఈనెల 3వ తేదీ వరకు గడువు ఉందని, పోటీలో ఉన్న అభ్యర్థులు ఈ నెల 13వ తేదీ లోపు వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో ప్రచారం ముగించాలని, ఈనెల 15న ఎన్నికలు పద్మశాలి సంఘం కార్యాలయంలోనిర్వహించడం జరుగుతుందని అడహాక్ కమిటీ సభ్యులు పుట్ట సదానందం తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా కుల బాంధవులు సహకరించాలని ఆయన కోరారు.
సతీష్ బాబు వైపు కుల బాంధవులు?
పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్ష స్థానానికి బరిలో నిలిచిన బత్తుల సతీష్ బాబు వైపే కుల బాంధవులు మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమవుతుంది. వ్యాపార రంగంలో, జర్నలిజంలో అంచలంచెలుగా ఎదుగుతున్న ఆయనను కుల బాంధవుల ప్రోత్సహంతో అధ్యక్ష బరిలో నిలిచారు. స్వతహాగా వ్యాపారి కావడం, ప్రజలతో, పట్టణ వ్యాపారస్తులతో సత్సంబంధాలు కలిగి ఉండడం, ఇదే సందర్భంలో అధికార పార్టీతో పాటు, పలు రాజకీయ పార్టీలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండడం, జర్నలిస్టుగా కొనసాగడం ఆయనకు కలిసొచ్చే అంశాలు.
దీనికి తోడు యువకుడు కావడంతో పట్టణ పద్మశాలి సంఘంలో ప్రస్తుతం యువతరం సభ్యత్వం అధికంగా తీసుకోవడం యువత ఆయన వైపు నిలబడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఈనెల 15న జరగనున్న ఎన్నికల్లో బత్తుల సతీష్ బాబు ఎన్నిక లాంచనమే అని ఆయన అనుయాయులు సోషల్ మీడియాలో, కుల బంధువులతో వ్యక్తిగతంగా కలిసి ముమ్మరంగా ప్రచారం చేపడుతూ ఆయనకు అండగా నిలబడుతున్నారు. ఏదేమైనప్పటికీ యువకుడు అన్ని వర్గాల ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉన్న సతీష్ బాబు వైపే కుల బంధువులు మొగ్గుచూపే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతుంది.
కుల బాంధవుల ప్రోత్సాహంతో సంఘం అభివృద్ధికి కృషి
-బత్తుల సతీష్ బాబు
పద్మశాలి సంఘం అధ్యక్ష పదవికి యువకుడైన తనను కుల బంధువుల ప్రోత్సాహంతో అధ్యక్ష బరిలో నిలిచానని అందరి సహకారంతో అధ్యక్షునిగా విజయం సాధించి సంఘం అభివృద్ధికి పాటుపడతానని బత్తుల సతీష్ బాబు స్పష్టం చేశారు. పద్మశాలి సమాజంలో ఇప్పటివరకు కుల సంఘం అభివృద్ధి కోసం యువత ముందుకు రాలేదని, సమాజాభివృద్ధి యువతరం చేతిలోనే ఉందని యువత, కుల బాంధవుల ప్రోత్సాహంతో సంఘాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకు వెళ్తానని తనను ఆదరించి గెలిపించాలని కోరారు.