19-06-2025 01:07:14 AM
-బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్
- స్థానిక సంస్థల 42 శాతం రిజర్వేషన్ల కోసం ధర్నా చౌక్లో మహా దీక్ష
ముషీరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వం తమ ఎన్నికల హామీ మేరకు కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగ రక్షణ చర్యలకే పంపిన 42 శాతం ఓబిసి రిజర్వేషన్ చట్టం తక్షణ అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల సాధనకు బుధవారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ ఆధ్వర్యంలో మహా దీక్ష చేపట్టారు.
ఈ దీక్షకు ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు, విద్య, ఉపాధి రంగాలలో ఈ రిజర్వేషన్ల అమలుకై రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణ కార్యాచరణ చేపట్టాలని లేకుంటే ఈ దీక్షలు రాష్ట్రవ్యాప్త దీక్షలుగా ఆమరణ నిరాహార దీక్షలుగా చేపట్టవలసి వస్తుందని హెచ్చరించారు. గత 18 నెలలుగా ఈ హామీ అమలులో అసాధారణ జాప్యం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా అఖిలపక్షాల ద్వారా ఒత్తిడి, ఉద్యమ కార్యాచరణ, తమిళనాడు వలె న్యాయపోరాటా నికై చిత్తశుద్ధి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఈ అంశం నేడు కేంద్ర ప్రభుత్వ ఆమోదంకై సిద్ధమై ఉన్నందున తక్షణమే రాజ్యాంగ రక్షణ చర్యలు చేపట్టి బీసీలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరి వైఖరి తక్షణమే విడనాడాలన్నారు. తమ హామీ అమలుకై జీవో ఇచ్చి స్థానిక ఎన్నికలకు పోదామని ప్రయత్నించినా, రిజర్వేషన్ల పెంపు లేకుండా పాత పద్ధతిలో ఎన్నికలకు పోదామని ప్రయత్నించినా ఈ రాష్ట్రం రావణ కాష్టంగా మారుతుందని హెచ్చరించారు.
ఈ ధర్నాలో తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనా చారి, మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు, సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ, ఆనంద్ జిడి(బిజెపి) డాక్టర్ వినయ్, పి. శివశంకర్ (కాంగ్రెస్), బండారి రవి (సీపీఐ ఎం) బీసీ సంఘం నేతలు గుజ్జ కృష్ణ, దాసు సురేష్, కోల జనార్దన్, వేముల రామకృష్ణ, పి. సుధాకర్, గోనారి ముధిరాజ్, డి. సుధాకర్ ముధిరాజ్, శ్రీనివాస్, వంశీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.