జీహెచ్ఎంసీ డివిజన్లపై అభ్యంతరం
కమిషనర్ కర్ణన్కు వినతిపత్రం అందజేత
తుర్కయంజాల్, డిసెంబర్ 15(విజయ క్రాంతి): జీహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీల విలీనం, డివిజన్ల విభజన, జోన్ల కేటాయింపుపై బీజేపీ తుర్కయంజాల్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ తుర్కయంజాల్ అధ్యక్షుడు ఎలిమినేటి నర్సింహారెడ్డి మాట్లాడుతూ జీహెచ్ఎంసీలో విలీనం ముసాయిదాలో ప్రతిపాదించిన డివిజన్ల విభజన అశాస్త్రీయంగా ఉందని ఆరోపించారు.
జోన్ కేటాయింపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్కు లిఖితపూర్వకంగా రాసిచ్చినట్లు తెలిపారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో తక్కువ డివిజన్లను చేశారని మండిపడ్డారు. ఇది పూర్తిగా ఏకపక్షంగా, పక్షపాతంగా ఉందన్నారు. తుర్కయంజాల్లో ప్రస్తుత జనాభా, రెవెన్యూ ప్రాంతం కలిపి నాలుగు డివిజన్లుగా విభజించాలని సూచించారు. డివిజన్లకు పేర్ల కేటాయింపును కూడా వ్యతిరేకిస్తున్నామన్నారు. తుర్కయంజాల్ను ఎల్బీనగర్ జోన్లో కలుపుతున్నట్లు అధికారికంగా ప్రకటించాలని సూచించారు.






