07-01-2026 12:45:16 AM
జగిత్యాల, జనవరి 6 (విజయ క్రాంతి ఎన్నిక): ముసాయిదా ఓటర్ జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల10 వ తేది లోపు వ్రాత పూర్వకంగా తెలపాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ కోరారు. జిల్లాలోని 5 మున్సిపాలిటీల పరిధీలలో ప్రకటించిన ఓటర్ల జాబితాపై రాజకీయ పార్టీ మున్సిపల్ ఎన్నికల రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం కలెక్టరేట్ లో సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మూసాయిదా ఓటర్ల జాబితాలో వచ్చిన అభ్యంతరాలను, పొలిటికల్ పార్టీ నాయకులు లేవనెత్తిన అంశాలను క్షేత్ర స్థాయిలో పరిష్కరించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ప్రధానంగా ఒకే కుటుంబానికి చెందిన వారి పేర్లు వేరువేరు వార్డుల్లో ఉండటం, విలీన గ్రామాల్లోని వారందరినీ ఒకే వార్డులో ఉంచకపోవడం, పట్టణంలో ఒకే ప్రాంతానికి చెందిన వారిని రెండు, అంతకంటే ఎక్కువ వార్డుల్లోకి మార్చడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని తెలిపారు.
వీటిపై మున్సిపల్ కమిషనర్ లు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని పొలిటికల్ పార్టీలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమం లో జిల్లా అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్, మున్సిపల్ కమిషనర్ లు, పొలిటికల్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.