ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలి
కలెక్టర్ అంకిత్
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 1 (విజయక్రాంతి): ఐడీఓసీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యచందన, డి ఆర్ ఓ పద్మావతి తో కలసి ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించి సమగ్రంగా పరిశీలించారు.
జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ వ్యక్తిగత, సామూహిక సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారంలో శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని తెలిపారు. ప్రతి వినతిపత్రాన్ని బాధ్యతాయుతంగా పరిశీలించి తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. వెంటనే పరిష్కరించగల సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని, మిగిలిన సమస్యలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






