11-06-2025 12:57:44 AM
ప్రారంభానికి ముస్తాబవుతున్న పాఠశాలలు
పుస్తకాలు, దుస్తులు సిద్ధం
మహబూబాబాద్, జూన్ 10 (విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఈసారి బడి తెరవడానికి ముందే విద్యార్థులకు పాఠశా లలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. మహబూబా బాద్ జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా 18 మండలాల ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారులు పాఠశాలల బాట పట్టారు.
పాఠశాలలు తెరవడానికి మరో రెండు రోజుల గడువు ఉండగా , మంగళవారం జిల్లాలోని గురుకులాలు, హాస్టళ్ళు, ప్రభుత్వ పాఠశాలల ఆవరణను శుభ్రం చేయించడంతోపాటు, తరగతి గదులను కడిగి శుభ్రం చేయిస్తున్నారు. కొన్ని చోట్ల పాఠశాలలకు రంగులు వేయించి నేమ్ బోర్డులు రాయించి అందంగా ముస్తాబు చేస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం రోజే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించడానికి మూడు లక్షలకు పైగా పాఠ్య పుస్తకాలను స్కూల్ పాయింట్ కు చేరవేశారు.
అలాగే 42,989 మంది విద్యార్థులకు ఒక్కో జత ఏకరూప దుస్తులను పాఠశాల ప్రారంభం రోజునే అందించడానికి ఇప్పటికే పాఠశాలలకు చేర్చారు. విద్యా సంవత్సరం ప్రారంభం రోజున వెయ్యికి పైగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో పండగ వాతావరణం కనిపించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో కేవలం విద్యాశాఖ అధికారులు మాత్రమే పాఠశాలల ప్రారంభ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తుండగా, ఈసారి ప్రభుత్వ ఆదేశాలతో కలెక్టర్ వివిధ శాఖల అధికారులను కూడా భాగస్వాములను చేసి ‘బడిబాట’ పట్టించారు. దీనితో మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా పాఠశాలల్లో పునః ప్రారంభ ఏర్పాట్ల సందడి కనిపించింది.
టీచర్ల విస్తృత ప్రచారం!
అటు బడిబాట..ఇటు అంగన్వాడీ బాట..
మహబూబాబాద్, జూన్ 10 (విజయ క్రాంతి): ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాల్లో పిల్లల అడ్మిషన్ల కోసం టీచర్లు గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక సారధి ప్రచార బృందం మంగళవారం జిల్లాలోని వివిధ గ్రామాల్లో ప్రభుత్వ విద్యాలయాల్లో అమలు చేస్తున్న సౌకర్యాలు, వసతులపై కళాజాత నిర్వహించారు.
ఉపాధ్యాయులు తమ పాఠశాలలో గత విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణత వివరాలను తెలిపే విధంగా ప్రచార పోస్టర్లు, కరపత్రాలు ఇంటింటికి పంచడంతోపాటు గ్రామాల్లో మైకు ద్వారా విస్తృత ప్రచారం సాగిస్తున్నారు. ఇక ఇదే తరహాలో అంగన్వాడీలో పిల్లలను చేర్పించాలంటూ టీచర్లు, ఆయాలు, ఐసిడిఎస్ అధికారులు సిబ్బంది ‘అమ్మ మాట అంగన్వాడి బాట’ కార్యక్రమాన్ని చేపట్టారు.