02-06-2025 01:03:20 AM
‘కార్తికేయ2’కు పాన్ ఇండియా స్థాయి విజయం దక్కటంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు హీరో నిఖిల్. ఇప్పుడు మరో పాన్ ఇండియా వెంచర్ ‘స్వయంభు’తో వస్తున్నాడు. ఇది అతని 20వ మైలురాయి చిత్రం. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ హిస్టారిక్ యాక్షన్ ఎపిక్ మూవీ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఇందులో నిఖిల్ మునుపెన్నడూ చూడని అవతార్లో ఒక లెజెండరీ యోధుడిగా కనిపించనుండగా.. అతనికి జోడీగా సంయుక్త మీనన్ కథానాయికగా కనిపించనుంది.
ఇందులో నభా నటేశ్ మరో హీరోయిన్గా నటిస్తోంది. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. ఆదివారం నిఖిల్ పుట్టినరోజును పురస్కరించుకొని మూవీ టీమ్ పవర్ఫుల్ పోస్టర్ను రిలీజ్ చేసింది. నాయకానాయికలు నిఖిల్, సంయుక్త యుద్ధ నేపథ్యంలో కనిపించిన ఈ పోస్టర్ అదిరిపోయింది. నిఖిల్ యుద్ధభూమిలో కత్తి పట్టుకుని యోధుడిలా పవర్ఫుల్గా కనిపించారు.
అతని పక్కన, సంయుక్త విల్లంబులు ధరించి కనిపిస్తూ ఆకట్టుకుంది. అంతేకాకుండా బ్యాక్డ్రాప్లో సెంగోల్ ఉండటం ఆసక్తిని రేకెత్తించింది. సెంగోల్.. శక్తి, ధర్మానికి చిహ్నం. ప్రాచీన రాజ్యాల నుంచి స్వాతంత్య్రం వరకు భారతదేశ చరిత్రలో సెంగోల్కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రాచీన చరిత్ర ప్రకారం శ్రీరాముడు సెంగోల్ను నీతిమంతమైన పాలనకు చిహ్నంగా అందుకున్నారు. ఇది న్యాయమైన నాయకత్వానికి ఉదాహరణ కూడా.
ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ గొప్ప వారసత్వానికి నివాళులర్పిస్తూ కొత్త పార్లమెంట్ భవనంలో స్పీకర్ సీటు దగ్గర సెంగోల్ను ప్రతిష్ఠించారు. ఇలా ఈ శక్తివంతమైన నేపథ్యాల చుట్టూ అద్భుతమైన కథతో వస్తోందీ సినిమా. త్వరలో ఈ సినిమా టీజర్ కూడా విడుదల చేయనుంది. ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్; సినీమాటోగ్రఫీ: కేకే సెంథిల్కుమార్; డైలాగ్స్: విజయ్ కామిశెట్టి; యాక్షన్: కింగ్ సోలమన్, స్టంట్ సిల్వా; సాహిత్యం: రామజోగయ్యశాస్త్రి; ఎడిటర్: తమ్మిరాజు.