13-05-2025 12:00:00 AM
అటవీ అభివృద్ధి సంస్థ అధికారుల రక్త దానం
మంచిర్యాల, మే 13 (విజయక్రాంతి) : తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ( టీజీఎఫ్ డీసీ ) అధికారులు, సిబ్బంది మంచిర్యాలలో రక్తదానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఈ నెల 5 నుంచి 14 వరకు అటవీ అభివృద్ధి సంస్థ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సోమవారం మంచిర్యాలలోని రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న రక్త నిధి కేంద్రంలో ఈ రక్త దాన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా అటవీ అభివృద్ధి సంస్థ కాగజ్ నగర్ డివిజనల్ మేనేజర్ శ్రావణి మాట్లాడుతూ ఈ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని సమాజంలో కొందరికైనా తమ రక్తం ఉపయోగపడుతుందనే ఒక మంచి తలంపుతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.
అటవీ అభివృద్ధి సంస్థ మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్, కాగజ్ నగర్ రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ ఎడ్ల లక్ష్మణ్, బెల్లంపల్లి రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ వి. సునీతతో పాటు పలువురు ఫీల్డ్ సూపర్ వైజర్ లు, వాచర్ లు, డ్రైవర్లు రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా మంచిర్యాల రక్తనిధి కేంద్రం ఇంచార్జ్, రెడ్ క్రాస్ సొసైటీ నిర్వాహకులు మధుసూదన్ రెడ్డి రక్త దానం చేయడానికి ముందుకొచ్చిన, తన సిబ్బందిని ప్రోత్సహించిన అటవీ అభివృద్ధి సంస్థ కాగజ్ నగర్ డివిజనల్ శ్రావణిని శాలువాతో సన్మానించి సత్కరించి, రక్త దానం చేసిన వారందరికీ సర్టిఫికెట్లు అందజేశారు.