calender_icon.png 20 February, 2026 | 3:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్ష్య సాధనకు అంకితభావంతో కృషిచేయాలి

20-02-2026 01:51:31 AM

కలెక్టర్ ఇలా త్రిపాఠి 

నిజామాబాద్, ఫిబ్రవరి 19(విజయ క్రాంతి) : తమకు ఇష్టమైన రంగంలో లక్ష్యాన్ని నిర్దేశించుకుని అంకిత భావంతో కృషి చేస్తే తప్పక విజయం సాధించవచ్చని కలెక్టర్ ఇలా త్రిపాఠి విద్యార్థినులను ఉద్బోధించారు. విద్యార్థి దశ ఎంతో కీలకమైనదని, చక్కగా చదువుకుని ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. గురువారం ఆర్మూర్ మండలం మునిపల్లిలో గల మహాత్మ జ్యోతిబాపూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్/డిగ్రీ కళాశాల వార్షికోత్సవానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి వార్షికోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పరీక్షలు సమీపించిన దృష్ట్యా కష్టపడి చదవాలని సూచించారు. తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదని, ఎన్ని అడ్డంకులు, అవరోధాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందుకు సాగాలని అన్నారు. ప్రతిభను ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకుంటే ఉన్నత అవకాశాలు తలుపు తడతాయని అన్నారు.

ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడం జరుగుతోందని, ఈ సందర్భంగా ఉత్తమ మార్కులు సాధించిన వారికి, వివిధ పోటీలలో గెలుపొందిన విజేతలకు కలెక్టర్ బహుమతులు ప్రదానం చేశారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బాలికలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆర్.సీ.ఓ సత్యనాథ్ రెడ్డి, తహసీల్దార్ కిరణ్మయి, కళాశాల ప్రిన్సిపల్ అనూష, అర్చన, స్వప్న తదితరులు పాల్గొన్నారు.