17-10-2025 12:36:32 AM
కరీంనగర్ క్రైం, అక్టోబరు 15 (విజయ క్రాంతి): ఆన్లైన్లో ’మెటా ఫండ్’ అనే నకిలీ కాయిన్ యాప్ ను సృష్టించి, అధిక లాభాల ఆశ చూపి ప్రజల నుండి సుమారు 25 నుండి 30 కోట్ల వరకు పెట్టుబడులు వసూలు చేసి మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడు హైదరాబాద్ మల్కాజ్గిరి కి చెందిన వరాల లోకేశ్వర్రావు (32)ను కరీంనగర్ పోలీసులు బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు.
గురువారం సీపీ గౌస్ ఆలం మీడియాతో మాట్లాడుతూ సాఫ్ట్వేర్ అప్లికేషన్ల తయారీలో నైపుణ్యం కలిగిన లోకేశ్వర్రావు కరీంనగర్ కు చెందిన తులసి ప్రకాష్ (56), బూర శ్రీధర్ (54), దాసరి రాజు (39), దాసరి రమేష్ (50), కట్ల సతీష్ (49) లతో కలిసి ఈ మోసానికి ప్రణాళిక రచించారు. లోకేశ్వర్రావు నకిలీ ’మెటా ఫండ్’ ఆన్లైన్ యాప్ ను, కాయిన్లను సృష్టించారు. 90,000 పెట్టుబడికి 1,000 కాయిన్లు ఇస్తామని, నెల రోజుల్లో మూడు రెట్లు లాభంతో అమ్ముకోవచ్చని ప్రజలను నమ్మించారు.
బాధితులను నమ్మించడానికి రిసార్ట్లు, గోవా, విదేశీ ట్రిప్ లకు తీసుకెళ్లి ప్రలోభాలకు గురిచేశారు. బాధితుల నుండి డబ్బును నగదు రూపంలో తీసుకుని, కేవలం ఆన్లైన్లో నకిలీ ఐడీలు, కాయిన్లను కేటాయించారు. డబ్బు విత్ డ్రా చేయలేని విధంగా యాప్ ను రూపొందించారు. చివరికి యాప్ ను ఆన్లైన్ నుండి తొలగించి ప్రజలను మోసం చేశారు. కరీంనగర్ రూరల్, టూ టౌన్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
ప్రాథమిక దర్యాప్తులో తులసి ప్రకాష్, బూర శ్రీధర్, దాసరి రాజు, దాసరి రమేష్, కట్ల సతీష్లను గతంలోనే అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. దర్యాప్తులో భాగంగా ప్రధాన నిందితుడు వరాల లోకేశ్వర్రావును బుధవారం రాత్రి ఎల్.యం.డి. అలుగునూరు వద్ద అరెస్ట్ చేశారు.
నిందితుల వద్ద నుండి బాధితుల డబ్బుతో కొనుగోలు చేసిన ఆస్తుల పత్రాలు, 30 తులాల బంగారం, మొబైల్ ఫోన్లు, ట్యాబ్లు, అలాగే ప్రధాన నిందితుడి వద్ద నుండి ఒక బి.ఎం.డబ్ల్యూ. కారు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకుని ఛేదించిన పోలీస్ సిబ్బందిని సిపి అభినందించారు.