06-11-2025 12:00:00 AM
-ఉగ్రవాదుల స్థావరాన్ని చుట్టుముట్టిన సైన్యం
-కిష్తివాడ్లో కొనసాగుతున్న భీకర కాల్పులు
-బుధవారం తెల్లవారుజామున భద్రతా బలగాల సెర్చ్ ఆపరేషన్
-కశ్మీర్ పోలీసులతో కలిసి ఆపరేషన్ చేపట్టిన సైన్యం
శ్రీనగర్, నవంబర్5: జమ్మూకశ్మీర్ లోని కిష్తివాడ్లోని ఛత్రు ప్రాంతంలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య భీకర కాల్పులు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదుల హైడవుట్పై నిఘా వర్గాల సమాచారం మేరకు సైనిక బలగాలు బుధవారం ఉదయం సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ముగ్గురు ఉగ్రవాదులు నెలల తరబడి తిష్ట వేసిన ఇంటిని చుట్టుముట్టాయి.
‘ఆపరేషన్ ఛత్రు’ పేరుతో కశ్మీర్ పోలీసులతో కలిసి సైన్యం ఈ ఆపరేషన్ చేపట్టింది.భద్రతాబలగాల రాకను గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడగా.. సైన్యం ఎదురు కాల్పులు జరుపుతోంది. భారత సైన్యంలోని వైట్ నైట్ కారప్స్, కశ్మీర్ పోలీసు బృందాలు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ను కొనసాగిస్తున్నాయని అధికారులు తెలిపారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని వారు పేర్కొన్నారు.
ఛత్రూలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్టు గుర్తించిన భద్రతా దళాలు ముందస్తు సమాచారంతో కూంబింగ్ నిర్వహించారు. ఉగ్రవాదుల జాడను గుర్తించి.. చుట్టుముట్టారు. దీంతో కిష్తివాడ్ జిల్లా ఛత్రూలో సైనికులు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ మేరకు పోలీసులతో కలిసి ఆపరేషన్ ఛత్రు చేపట్టినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.కిష్తివాడ్లోని ఛత్రు ప్రాంతంలో ఉగ్రవాదులు కొన్ని నెలలుగా దాక్కున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.
ఈ మేరకు సమాచారం అందుకున్న సైనికులు, కశ్మీర్ పోలీసులతో కలిసి సంయుక్త బృందాలుగా ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. అనంతరం బుధవారం తెల్లవారుజామున సెర్చ్ ఆపరేషన్ను నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.