12-06-2025 11:24:51 PM
సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే అక్కసుతోనే ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎస్.వినోద్ కుమార్(Former TPCC General Secretary Vinod Kumar) అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి, నియోజకవర్గంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమానికి చూసి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మహబూబ్నగర్ కార్పొరేషన్లో వార్డుల విభజన విషయంలో ఆశాస్త్రీయంగా ఉందని ప్రతిపక్ష నాయకులు ఫిర్యాదులు చేయడం జరిగిందన్నారు. కార్పొరేషన్లో 60 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందన్న వాస్తవాన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నారని ఆరోపించారు.
జీవో ప్రకారం అధికారులు వార్డుల విభజన చేస్తున్నట్లు తెలిపారు. అభ్యంతరాలపై ప్రతిపక్షాలు ఫిర్యాదులు ఇచ్చారనీ, ఫైనల్ లిస్టు వచ్చే వరకు వేచిచూడాలని హితవు పలికారు. ప్రతిపక్ష మాటలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో ప్రజలను ఓట్లు ఆడగడానికి చేతగాక ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాల మాటలను ప్రజలు నమ్మరని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామనే భయం ప్రతిపక్ష పార్టీల్లో నెలకొందన్నారు. నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. పాలమూరు యూనివర్సిటీలో లా ఇంజనీరింగ్ కళాశాలల మంజూరుతోపాటు యువతకు పోటీపరీక్షలకు ఉచిత కోచింగ్ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ మీడియా సెల్ కన్వీనర్ సీజే బెనహర్, నాయకులు అజ్మత్ అలీ, నాగరాజు, కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.