calender_icon.png 31 May, 2025 | 10:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఊపర్ షేర్వానీ.. అందర్ పరేషానీ!

13-03-2025 01:16:37 AM

రాష్ట్రానికి కేసీఆర్ వారసత్వంగా ఇచ్చింది ఆర్థిక క్యాన్సరే!

  1. వాస్తవాలు మీతో పంచుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా
  2. ప్రైవేట్ విద్యాసంస్థలతో ప్రభుత్వ విద్యాసంస్థలు పోటీపడాలి
  3. జేఎల్‌గా ఎంపికైన 1,532 మందికి నియామక పత్రాలు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి

మిగిలేది 550 కోట్లు.. అందులోనే..

రాష్ట్రానికి ప్రతినెలా రూ.18,500 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. అందులో రూ.6,500 కోట్లు జీతాలు, పెన్షన్లు ఇతర ఖర్చులకు పోతున్నాయి. మరో రూ.6,500 కోట్లు అయ్యగారు (కేసీఆర్) చేసిన అప్పులు, తప్పులకు వడ్డీలు కడుతున్నా. ఇదీ కేసీఆర్ నాకు ఇచ్చిన నజరానా!. రూ.18,500 కోట్లలో ఇంకా మిగిలిన రూ.550 కోట్లు రైతు భరోసా, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఉచిత విద్యుత్, గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ లో ఉచిత ప్రయాణం లాంటి 25 నుంచి 30 సంక్షేమ పథకాలు నడపాలి. ఇందులోంచే కాళేశ్వరం మరమ్మతులు, ఇతర పథకాలు, ప్రాజెక్టులకు నిధులు ఖర్చు చేయాలి.

 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్, మార్చి 12 (విజయక్రాంతి): రాష్ట్రానికి కేసీఆర్ వారసత్వంగా ఇచ్చింది అప్పులు, తప్పులని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతినెలా రూ.6,500 కోట్లు కేసీఆర్ చేసిన అప్పులు, తప్పులకే సరిపోతుందని ఆయ న చెప్పారు. కేసీఆర్ రాష్ట్రానికి ఆర్థికంగా క్యాన్సర్ ఇచ్చారని, రాష్ట్ర ఆర్థికపరిస్థితి అలానే ఉందన్నారు.

వాస్తవాలను దాచిపెట్టడం ఎందుకని తాను వాస్తవాలు చెబు తుంటే దిగిపో అని అంటున్నారని బీఆర్‌ఎస్ నాయకులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో బుధవారం కొలువుల పండు గ పేరిట జూనియర్ లెక్చరర్, పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాలకు ఎంపికైన 1,532 మందికి ముఖ్యమంత్రి నియామక పత్రా లు అందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇది మీకు కేవలం ఉద్యో గం మాత్రమే కాదు.. ఒక భావోద్వేగమన్నారు. తెలంగాణ రాష్ర్ట సాధనలో నిరుద్యోగుల పాత్ర క్రియాశీలకమైందన్నారు. కానీ గత ప్రభుత్వం నిరుద్యోగుల విషయంలో చిత్తశుద్ధి చూపలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటులో నిరుద్యోగుల కృషి, పట్టుదల ఉందన్నారు.

ప్రజాప్రభు త్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 57,946 ఉద్యోగాలను భర్తీ చేశామ న్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల ఉద్యోగాలు ఊడితేనే నిరుద్యోగులకు ఉద్యోగాలొ స్తాయని తాను ఆనాడే పిలుపునిచ్చానన్నారు. రాష్ట్ర అభివృద్ధికి లెక్చరర్లు తోడ్ప డాలని పిలుపునిచ్చారు.

రూ.22 వేల కోట్లు కావాలి..

గత పదేళ్లలో ఏనాడైనా ఒకటో తారీఖున ఉద్యోగాలకు జీతాలు పడ్డాయా? అని సీఎం ప్రశ్నించారు. తమ ప్రభుత్వం వచ్చాక ప్రతి నెలా ప్రభుత్వ ఉద్యోగులకు ఫస్ట్ తారీఖునే జీతాలు వేస్తున్నామన్నారు. ఈనెల కూడా ఆర్బీఐ నుంచి రూ.4 వేల కోట్లు తీసుకొచ్చి ఉద్యోగుల ఖాతాల్లో వేసినట్లు ఆయన చెప్పారు. ఉద్యోగులకు సంబంధించిన డీఏ, పీఆర్సీ లాంటి చిన్న చిన్న సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామన్నారు.

రాష్ట్రానికి ప్రతినెలా రూ.18 వేల నుంచి రూ.18,500 కోట్లు ఆదాయం వస్తుందని, అయితే అందులో రూ.6,500 కోట్లు జీతాలు, పెన్షన్లు ఇతర ఖర్చులకు పోతున్నాయన్నారు. మరో రూ.6,500 కోట్లు అయ్యగారు (కేసీఆర్) చేసిన అప్పులు, తప్పులకు వడ్డీలు కడుతున్నానని, ఇది కేసీఆర్ నాకు ఇచ్చిన నజరానా అని విమర్శించారు.

‘రూ.18,500 కోట్లలో ఇంకా మిగిలిన రూ.550 కోట్లతో రైతు భరోసా, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, ఉచిత విద్యుత్, గ్యాస్ సిలిండర్, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం లాంటి 25 నుంచి 30 సంక్షేమ పథకాలకు పోతాయి. పైగా ఇందులోంచే కాళేశ్వరం మరమ్మతులు, ఇతర పథకాలు, ప్రాజెక్టులు నిధులు ఖర్చు చేయాలి.

రాష్ట్రా న్ని సజావుగా నడపాలంటే రూ. నెలకు రూ.22 వేల కోట్లు అవసరం’ అని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ఊపర్ షేర్వాని, అందర్ పరేషానీలాగా రాష్ట్ర పరిస్థితి ఉందన్నారు. తాను ఒక్క రూపాయి లెక్క కూడా దాచిపెట్టడంలేదని, కష్టమైన.. నష్టమైనా నిజమే చెబుతున్నానన్నారు.

ప్రైవేట్‌తో మనం పోటీ పడలేమా?

ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న టీచర్ల బదిలీలు, పదోన్నతుల సమస్యను పరిష్కరించి విద్యాశాఖను ప్రక్షాళన చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విద్యా ప్రమాణాలు తగ్గిపోవడం ఆందోళన కలిగించే విషయమన్నారు. ఇది తెలంగాణ రాష్ట్రానికి అవమానకరమని ఆవేదన వ్యక్తంచేశారు. అందుకే విద్య ప్రమాణాలు పెంచేందుకు మీరంతా ఒక భావోద్వేగంతో విధులు నిర్వర్తించాలని నూతనంగా ఎంపికైన అధ్యాపకు లకు పిలుపునిచ్చారు.

విద్యార్థులపై ప్రభుత్వం పెట్టేది ఖర్చు కాదు.. అది వారి భవిష్యత్‌కు పెట్టుబడి అని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గుతుందో మూలాలను పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కో విద్యార్థిపైన ప్రభుత్వం ఏడాదికి రూ.90 వేల వరకు ఖర్చు చేస్తుంటే, ప్రైవేట్ విద్యార్థిపై చేసే ఖర్చు రూ.30 వేల వరకేనని అన్నారు. ఇప్పటి వరకు 57,946 ఉద్యోగ నియామక పత్రాలను అందజేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వం తీరుతో విద్యాశాఖలో రాష్ట్రం చిట్టచివరి రెండుమూడు స్థానాల్లో ఉందన్నారు.

రాణించాలంటే నైపుణ్యముండాలి..

ప్రభుత్వ స్కూళ్లలో విద్యాప్రమాణాలు పెంచేందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌ను నిర్మించబోతున్నామన్నారు. ఇటీవలే 55 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం రూ.11,000 కోట్లు కేటాయించామన్నారు. వచ్చే ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ అథారిటీని ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు.

క్రికెట్‌లో రాణించిన సిరాజ్‌కు ఉద్యోగం ఇచ్చా మన్నారు. బాక్సింగ్‌లో రాణించిన నిఖత్ జరీన్‌కు డీఎస్పీ ఉద్యోగం కల్పించామన్నారు. పారాలింపిక్స్‌లో రాణించిన దీప్తి జీవాంజీకి ఇంటి స్థలంతో పాటు ఉద్యోగం ఇచ్చామన్నారు.

కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా, కళాశాల విద్య, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి, అధికారులు జయప్రదాబాయి పాల్గొన్నారు.

పదేళ్లు ఉండి పది నెలల్లో దిగిపో అంటున్నారు

కొంతమంది స్ట్రేచర్.. స్ట్రేచర్.. అని మాట్లాడుతున్నారన్నారు. స్ట్రేచర్ ఉందని విర్రవీగినవారు స్ట్రెచ్చర్ మీదకు వెళ్లారన్నారు. స్ట్రేచర్ అనేది స్థానానికి తప్ప వ్యక్తులకు ఉండదన్నారు. రాష్ట్రానికి కేసీఆర్ ఆర్థికంగా క్యాన్సర్ ఇచ్చారన్నారు. క్యాన్సర్ ముదురుతుంటే రాష్ర్టం దివాళా తీసిందంటారా? అని అంటున్నారన్నారు. వాస్తవా న్ని ఎన్నాళ్ళు దాచిపెడతారు? అని ప్రశ్నించారు.

తాను వాస్తవాలు చెబుతుంటే కుర్చి నుంచి దిగిపో దిగిపో అని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం మొత్తం ఫ్యామిలీ ప్యాకేజ్‌లా అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. అబద్ధాల ప్రాతిప దికన తాను రాష్ట్రాన్ని నడప నన్నారు. వాస్తవాలు పంచుకుని రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

తాను వాస్తవా లు, ఉన్నది ఉన్నట్లు చెప్పే ఈ స్థాయికి వచ్చానన్నారు. పదేళ్లలో ఒక్క ప్రాజెక్టును సరిగా కట్టలేదని, అది కాళేశ్వరం కాదని కూలేశ్వరమన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో ఎస్‌ఎల్‌బీసీని పూర్తి చేయలేకపోయారని, అక్కడ ప్రమాదం జరిగితే అదేపనిగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.