calender_icon.png 1 June, 2025 | 7:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరుణించని వరుణుడు

27-05-2025 07:59:55 PM

సారంగాపూర్ (విజయక్రాంతి): నోటికాడి కచ్చిన బుక్క చేతి నుండీ చేజారి భూమి పాలైనట్టు ఉన్నది ప్రస్తుతం మండలంలోని రైతుల పరిస్తితి. ఆరుగాలం శ్రమించి పండించిన పంట వర్షాలకు దెబ్బతినడంతో రైతులు అల్లారుపాలౌతున్నారు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు మండలంలోని వరి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవడంతో రైతుల కండ్లు కూడా కన్నీళ్ళతో తడుస్తూనే ఉన్నాయి. మండలంలో మంగళవారం ఈదురు గాలులతో కురిసిన వర్షానికి రైతులు ఉక్కిరిబిక్కిరయ్యారు. టర్పరిన్లు ఈదురు గాలులకు ధాన్యం పై నుండి కొట్టుకుపోయాయి.

వర్షంలో రాళ్ళ కోసం వెతికి పట్టుకుని టర్పరిన్లు పై రాళ్ళు పెట్టారు. ప్రభుత్వం సరైన సమయంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడం , లారీల కొరత , హమాలీల కొరత, సంచుల కొరత ఉండడం రైతుల ఆవేదనకు ప్రధాన కారణాలు. వర్షానికి ధాన్యం తడవడంతో నాణ్యత కోల్పోయి రైతులు తీవ్ర నష్టాల పాలవ్వక ముందే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం వేగవంతం చేయాలని రైతులు సంబంధిత శాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.