calender_icon.png 4 February, 2026 | 4:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొలంబో చేరుకున్న పాక్

04-02-2026 01:23:31 AM

భారత్‌తో మ్యాచ్‌పై సందిగ్ధత 

ఐసీసీకి మెయిల్ పంపని పీసీబీ

కొలంబో, ఫిబ్రవరి 3: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 కోసం పాకిస్థాన్ జట్టు శ్రీలంకకు చేరుకుంది. భారర్‌తో మ్యాచ్‌ను బాయికాట్ చేస్తున్నామని పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆ జట్టు రాక ప్రాధాన్యతను సంతరించుకుంది. సల్మాన్ అలీ అఘా సారథ్యంలోని పాకిస్థాన్ జట్టు మంగళవారం విశ్రాంతి తీసుకొని బుధవారం సిహళీస్ స్పోర్ట్స్ క్లబ్‌లో ఐర్లాండ్‌తో తమ ఏకైక వామప్ మ్యాచ్ ఆడనుంది. పాకిస్థాన్ జట్టు భారత్, అమెరికా, నెదర్లాండ్స్, నమీబియాతో గ్రూప్-ఏలో ఉంది. ఫిబ్రవరి 7న నెదర్లాండ్స్‌తో తొలి మ్యాచ్ ఆడనున్న పాకిస్థాన్.. ఫిబ్రవరి 10న అమెరికాతో, ఫిబ్రవరి 15న భారత్, ఫిబ్రవరి 18న నమీబియాతో ఆడనుంది. అయితే భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నామని పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది.

ఈ ప్రకటనపై ఐసీసీ ఘాటుగా స్పందించింది. టీ20 ప్రపంచకప్ 2026లో ఒక జట్టుతో మాత్రమే ఆడబోమని చెప్పడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంది. పాకిస్థాన్ నిర్ణయం వల్ల కలిగే పరిణామాల గురించి హెచ్చరించింది. కఠిన ఆంక్షలు విధించాల్సి ఉంటుందని హెచ్చరించింది. అయితే ఈ వ్యవహారంపై పీసీబీ నుంచి అధికారిక సమాచారం లేదని పేర్కొంది. ఈ క్రమంలోనే పీసీబీతో ఐసీసీ సంప్రదింపులు ప్రారంభించింది. తమ మాట వినకపోతే టోర్నీ నుంచి పూర్తి నిషేధం విధిస్తారనే ప్రచారం కూడా జరిగింది. కానీ పాకిస్థాన్ టీమ్ శ్రీలంకలో అడుగుపెట్టడంతో ఐసీసీ తీసుకోబోయే చర్యలపై ఉత్కంఠ నెలకొంది. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతుందా? లేదా? అనేది కూడా చర్చనీయాంశమైంది.